రాష్ట్రంలోని ప్రైవేటు పీజీ వైద్య కళాశాలల్లోని మేనేజ్మెంట్ సీట్లకు నిర్వహిస్తున్న ప్రవేశాల ప్రక్రియ గందరగోళంగా మారింది. మొదటి విడత కౌన్సెలింగ్కు ప్రకటించిన ప్రాధాన్యతా క్రమం (మెరిట్ లిస్ట్) రెండో విడతకు వచ్చేసరికి మారిపోయింది. అదనంగా 60 మందికిపైగా కొత్తగా వచ్చి చేరారు. దీంతో రెండో విడతలోనైనా తప్పకుండా సీటు వస్తుందని ఆశపడ్డ వారికి నిరాశ ఎదురైంది. యాజమాన్య సీట్ల కమిటీ నిర్ణయాలతోనే ఇలా జరుగుతోందంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇష్టానుసారంగా ప్రాధాన్య క్రమంలో కొత్త ర్యాంకులను చేరుస్తుండటం వివాదానికి దారితీస్తోంది. తమ ర్యాంకుకు సీటు వస్తుందని అంచనా వేసుకునేలోపే తమకంటే ముందు కొత్త ర్యాంకర్లు చేరి సీట్లను ఎగరేసుకుపోతున్నారంటూ పలువురు ఆశావహులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొవిడ్ కారణంగా ఏడాది విద్యా సంవత్సరం నష్టపోగా, విశ్వవిద్యాలయం తీసుకున్న ఇలాంటి నిర్ణయాలతో తమకు మరింత అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. దీనిపై పలువురు విద్యార్థులు ఎన్టీఆర్ విశ్వవిద్యాలయానికి వచ్చి ప్రశ్నిస్తున్నారు.
కటాఫ్ మార్కుల వల్లే..: ఆల్ ఇండియా కోటా ప్రవేశాల్లో అభ్యర్థులు లేకపోవడంతో గతంలో ఉన్న 302 కటాఫ్ మార్కులను 247కు తగ్గించారని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఎన్.శంకర్ తెలిపారు. ‘2017లో జారీ చేసిన జీవో 75 ప్రకారం ఎన్టీఆర్ వర్సిటీ తాజా నోటిఫికేషన్ను జాతీయ స్థాయిలో జారీ చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 365 మంది అభ్యర్థులు కొత్త ప్రాధాన్యతా క్రమంలోకి వచ్చి చేరారు. తగ్గించిన కటాఫ్ మార్కులతో పాటు అంతకుముందు దరఖాస్తు చేసుకోని వారు చేసుకునే వీలు కల్పించారు. ఉన్నత న్యాయస్థానాల అనుమతితో 10 మంది వరకు అభ్యర్థులు ప్రాధాన్యతా క్రమంలోకి వచ్చారు. దీంతో ప్రాధాన్యత క్రమం మార్చి ప్రవేశాలు చేపట్టాల్సి వచ్చింది. అలాగే ఆల్ ఇండియా కోటాలో కొత్తగా 146 క్లినికల్ సీట్లు రావడంతో అక్కడ మాప్ అప్ రౌండ్ను రద్దు చేసి తిరిగి ప్రవేశాలు చేపట్టారు. ఈ సీట్ల కోసం రాష్ట్రం నుంచి కొంత మంది వెళ్తే ఇక్కడ నాలుగో విడత కౌన్సెలింగ్ చేపడతాం. ప్రతిభ కలిగిన ఏ విద్యార్థికి నష్టం రాకుండా యూనివర్సిటీ అన్ని విధాలా చర్యలు తీసుకుంటుంది’ అని వెల్లడించారు.
ఇదీ చదవండి: జిల్లా కలెక్టరేట్లను నోటిఫై చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు.. జడ్పీలపై కీలక నిర్ణయం