గడిచిన పదేళ్లలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై పీఆర్ఎస్ లెజిస్లేటివ్ సర్వే సంస్థ అధ్యయనం నిర్వహించింది. 2010 - 20 మధ్య రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు, ఏయే అంశాలు బడ్జెట్ను ప్రభావితం చేస్తున్నాయి? ఆర్థిక వ్యవస్థల పనితీరు వంటి అంశాలపై సర్వే చేపట్టింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ఆదాయాలు 12 శాతం చొప్పున పెరిగాయని.. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే... మేఘాలయ, ఏపీ మెరుగైన పనితీరు కనబరిచినట్లు సంస్థ నివేదిక తేల్చింది. 2015 - 20 మధ్య రాష్ట్ర ఆదాయం 17 శాతం పెరిగిందని స్పష్టం చేసింది. 19 శాతం అభివృద్ధితో మేఘాలయ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది.
లబ్ధిదారులకు నేరుగా బదిలీ చేసే ఆర్థిక భరోసా పథకాలు ఏపీలో నాలుగు ఉన్నాయని సర్వే సంస్థ పేర్కొంది. సామాజిక భద్రత కార్యక్రమాలపై ఏపీ మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే అత్యధికంగా ఖర్చు చేసిందని తెలిపింది. ఈ అంశంలో 9.6 శాతం మేర నిధుల్ని రాష్ట్రం ఖర్చు చేసిందని పేర్కొంది.
జీఎస్టీ పరిహారం నిలిచిపోతే.... రాష్ట్రాలకు ఆదాయ లోటు ఏర్పడుతుందని పీఆర్ఎస్ సర్వే తేల్చిచెప్పింది. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రానికి జీఎస్టీ సెస్ రూపంలో... భారీ కోత పడే అవకాశమున్నట్లు అంచనా వేసింది. ఈ ఆర్థిక సంవత్సరానికి 18 వేల కోట్ల రూపాయల మేర లోటు ఉండే అవకాశమున్నట్లు తెలిపింది. 2022 వరకు మాత్రమే రాష్ట్రాలకు జీఎస్టీ అందుతుందని... ఆ తర్వాత అన్ని రాష్ట్రాలపైనా ఆర్థిక లోటు ప్రభావం ఉంటుందని వెల్లడించింది. రాష్ట్రాల ఆదాయాలకు, జీఎస్టీకి మధ్య ఉన్న నిష్పత్తి... ఆయా రాష్ట్రాల ఆర్థిక పరిపుష్ఠికి స్పష్టమైన సంకేతమని పీఆర్ఎస్ సంస్థ స్పష్టం చేసింది. 2015 - 16 నుంచి 2019 - 20 ఆర్థిక సంవత్సరాల మధ్య జీఎస్టీ నిష్పత్తి సగటున 6:4గా ఉందని తెలిపింది.
29 రాష్ట్రాల్లో జీడీపీ పెరుగుదల కన్నా... సొంత ఆదాయాల్లో పెరుగుదల రేటు అధికంగా ఉందని సంస్థ తెలిపింది. అమ్మకపు పన్ను, వ్యాట్, ఎక్సైజ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, విద్యుత్ ఛార్జీలు, ఇతర పన్నుల రూపంలో ఆదాయం సమకూరినట్లు పీఆర్ఎస్ సర్వే స్పష్టం చేసింది.