DEFENCE TECHNOLOGY: ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా విజ్ఞాన వారోత్సవాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా డీఆర్డీవో, ఇస్రో తదితర రక్షణ సంస్థలు సైన్స్ ప్రదర్శనలు ఏర్పాటు చేశాయి. విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్ట్ కళాశాల వేదికగా.. దేశ రక్షణలో కీలకమైన రాకెట్లు, పలు రకాల క్షిపణుల నమూనాలను ఉంచారు. వాటి పనితీరు, ప్రయోజనాన్ని డీఆర్డీఓ ప్రతినిధులు విద్యార్థులకు వివరిస్తున్నారు.
'స్పేస్ ఆన్ వీల్స్' పేరుతో విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇస్రో ఆధ్వర్యంలో సైన్స్ ఎక్స్పో నిర్వహిస్తున్నారు. 1960 నుంచి 2020 వరకు దేశం సాధించిన అంతరిక్ష విజయాలపై అనేక అంశాలను విద్యార్థులకు చెబుతున్నారు. భూమి నుంచి భూ ఉపరితలంపైకి, భూమి నుంచి ఆకాశంలోకి, భూమి నుంచి భూమిపైకి లక్ష్యాలను ఛేదించే క్షిపణుల నమూనాలు అగ్ని, పృథ్వి, ఆకాశ్, గౌతమ్- గౌరవ్, పినాక్, మిషన్శక్తి వంటి వాటిని విద్యార్థులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.
శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించిన అనేక అంశాలను విద్యార్థులు అవగతం చేసుకునేందుకు ఈ ప్రదర్శన ఉపయోగపడుతుందని ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రసాదరెడ్డి అన్నారు. దేశాభివృద్ధికి సైన్స్... ఎలా ఉపయోగపడుతుందో విద్యార్థులకు తెలియజేసేందుకు ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు ఇస్రో శాస్త్రవేత్త రమేశ్ బాబు చెప్పారు.
ఈ ప్రదర్శన ద్వారా క్షిపణుల నమూనాలు, రాకెట్లు, అంతరిక్షంలో అవి చేసే అద్భుత పరిశోధనల గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నామని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలో నిర్వహించిన ప్రదర్శనను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు, ఎంపీ జీవీఎల్ నరసింహారావు తిలకించారు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ ప్రదర్శనను ఉచితంగా తిలకించేలా అవకాశం కల్పిస్తున్నారు.
ఇదీ చదవండి: