రాష్ట్రంలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి అన్ని జిల్లాల యంత్రాంగాలు ఏర్పాట్లు పూర్తిచేశాయి. కృష్ణా జిల్లాలో విజయవాడ డివిజన్ పరిధిలో తొలి విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రిటర్నింగ్ అధికారులకు శిక్షణ పూర్తైంది. మొదటి దశలో 234 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల ప్రక్రియ సహా ఎన్నికల నిర్వహణలో నిబద్ధతతో వ్యవహరించాలని ఆర్.ఓ. లకు కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ సూచించారు.
విశాఖ జిల్లాలోని అనకాపల్లి డివిజన్ పరిధి 12 మండలాల్లో తొలిదశ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రిటర్నింగ్ అధికారులకు జిల్లా కలెక్టర్ వినయ్చంద్ శిక్షణ తరగతులు నిర్వహించారు. నామినేషన్ల అనుమతి, తిరస్కరణ వంటి వాటిలో పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. శ్రీకాకుళం జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రిటర్నింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకమని, పోటీచేసే అభ్యర్థుల సందేహాలను ఆర్ఓలే నివృత్తి చేయాలని కలెక్టర్ నివాస్ సూచించారు.
పశ్చిమగోదావరి జిల్లాలో నరసాపురం డివిజన్ పరిధిలోని 239 పంచాయతీలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి.. రిటర్నింగ్ అధికారుల శిక్షణ పూర్తైంది. అక్రమాలు, ఘర్షణలకు తావు లేకుండా ఎన్నికల నిర్వహణకు పటిష్ఠ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ మురళీధర్రెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లాలో ఎన్నికల నిర్వహణపై జిల్లా ఎన్నికల అధికారి దినేశ్కుమార్, ఎస్పీ విశాల్ గున్ని సమీక్షించారు. ఎన్నికలు పారదర్శకంగా, స్వేచ్ఛగా జరిగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అభ్యర్థులకు పత్రాల జారీ, ప్రచార అనుమతుల మంజూరులో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఆదేశించారు. నెల్లూరు జిల్లాలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు యంత్రాంగం సిద్ధమైంది. డికేడబ్లూ కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్ను పరిశీలించిన కలెక్టర్ చక్రధర్ బాబు.... పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
అనంతపురం జిల్లాలో తొలి విడత ఎన్నికలు జరిగే కదిరి డివిజన్లో నామినేషన్ల ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థుల నామినేషన్ల దాఖలుకు కదిరి డివిజన్లోని ఎంపీడీఓ కార్యాలయాల్లో ఏర్పాట్లు చేశారు. కడప జిల్లాలో నామినేషన్ల స్వీకరణకు నిర్వహణకు సంబంధించి.. రిటర్నింగ్ అధికారులకు కలెక్టరేట్లో శిక్షణ నిర్వహించారు. నామినేషన్ పరిశీలన పద్ధతులు, ఓటర్ల జాబితా వంటి అంశాలపై శిక్షణనిచ్చారు. కర్నూలు జిల్లాలోతొలి దశలో నంద్యాల, కర్నూలు రెనెన్యూ డివిజన్ల పరిధిలోని 12 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన పోలీసులు.. సీసీటీవీ కెమెరాల ద్వారా పరిస్థితిని సమీక్షించనున్నారు. రిటర్నింగ్ అధికారులకు నామినేషన్లు, స్క్రూటినీ, తిరస్కరణ, ఓట్లు, బ్యాలెట్ బాక్సులు వంటి విషయాలపై శిక్షణ ఇచ్చారు.
మరోవైపు.. పంచాయతీ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా అన్ని రాజకీయ పార్టీలూ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్ ఒంగోలులో పార్టీ కార్యకర్తలకు గెలుపుపై దిశానిర్దేశం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో 80 శాతం సీట్లు కైవసం చేసుకుంటామని మంత్రి అనిల్కుమార్యాదవ్ కర్నూలులో అన్నారు. వైకాపా అభ్యర్థుల గెలుపు కోసం కార్యకర్తలు కష్టపడాలని.... తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలని..... గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని పార్టీ శ్రేణులకు సూచించారు. వైకాపా వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలుగుదేశం నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు పార్టీ శ్రేణులకు సూచించారు.