వైఎస్సార్ పింఛను కానుక కింద కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి జులై 1వ తేదీన ప్రారంభమయ్యే పంపిణీలో.. పింఛను సాయం అందే పరిస్థితి లేదు. వీరికి జులై 19న మంజూరు పత్రాలు ఇస్తామని గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ(సెర్ప్) సీఈవో ఇంతియాజ్ తెలిపారు. అయితే అదే రోజు పంపిణీ చేస్తారా? ఆ తదుపరి పంపిణీ ఉంటుందా? అనే దానిపై అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు.
దీంతో దాదాపు 3 లక్షల మంది దరఖాస్తుదారులు ఎదురుచూస్తున్నారు. ఏడాదికి రెండు విడతల్లో ఆరు నెలలకొకసారి (జులై, జనవరి) కొత్త పింఛన్లు పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆ ప్రకారం ఈ ఏడాది జనవరిలో కొత్త పింఛన్లను మంజూరు చేసింది. అప్పటి నుంచి జూన్ వరకు దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. వాటిని ఇప్పటికే రెండు విడతలుగా తనిఖీ చేసి దాదాపుగా 3 లక్షల మందిని అర్హులుగా గుర్తించారు.
వివిధ సంక్షేమ పథకాలకు అర్హత ఉన్నా వివిధ కారణాలతో లబ్ధి అందని వారికి జులై 19న ఆ సాయాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, అందులో భాగంగా మంజూరు పత్రాలు అందిస్తామని అధికారులు వెల్లడించారు.
ఒంటరి మహిళలకు నిరాశ.. ఒంటరి మహిళల పింఛను అర్హత వయసును పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో చాలా మంది అనర్హులుగా మారారు. ఆ కేటగిరీకి చెందిన వారి అర్హత వయసును 35 నుంచి 50 ఏళ్లకు పెంచుతూ జూన్లో ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. అయితే పాత నిబంధనల మేరకు గత ఆరు నెలల వ్యవధిలో చాలా మంది ఒంటరి, అవివాహిత మహిళలు పింఛను కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం సాయం అందిస్తుందని ఎదురుచూస్తున్నారు. తాజాగా వీరికి కూడా 50 ఏళ్ల నిబంధన వర్తింపజేయడంతో చాలా మంది అనర్హులుగా మారినట్లు తెలిసింది.
ఇవీ చూడండి: