పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పర్యావరణ అనుమతులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ను ఎన్జీటీ కొట్టివేసింది. పర్యావరణ అనుమతులు లేకుండా పురుషోత్తపట్నం ఎత్తిపోతల చేపట్టారని మడిశర్ల సత్యనారాయణ గతంలో ఎన్జీటీలో పిటిషన్ వేయగా... విచారణ జరిపిన ట్రైబ్యునల్ పర్యావరణ అనుమతులు తీసుకునే వరకు ఎత్తిపోతల పథకం పనులు నిలిపివేయాలని తీర్పునిచ్చింది. ఆ తీర్పును సమీక్షించాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసింది. దానిని జస్టిస్ ఆదర్శ కుమార్ గోయల్, జస్టిస్ ఎస్పీ వాంగ్డి, నిపుణులు నగిన్ నందాలతో కూడిన ధర్మాసనం గత నెల 27న విచారించింది. సాగునీటి ప్రాజెక్టు కాదంటూ పేర్కొన్న ఏపీ ప్రభుత్వ అభ్యర్థనను తిరస్కరించిన ధర్మాసనం.. నిపుణుల కమిటీ పర్యావరణ అనుమతులు అవసరమని తేల్చినందున తీర్పును పున:సమీక్షించలేమని స్పష్టం చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ రివ్యూ పిటిషన్ ను కొట్టివేస్తూ బుధవారం లిఖితపూర్వక ఉత్తర్వులను వెల్లడించింది.
ఇదీ చదవండి: విశాఖలో యువతిపై కత్తితో యువకుడి దాడి