సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశామని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. రామవరప్పాడు ఎంపీపీ పాఠశాలలో నెలకొల్పిన మోడల్ పోలింగ్ స్టేషన్ను ఆయన సందర్శించారు. పోలింగ్ కేంద్రాలకు మైక్రో అబ్జర్వర్లు, వీడియోగ్రఫీ, వెబ్ కాస్టింగ్ సౌకర్యాలు కల్పించామన్నారు. ఎన్నికల నిర్వహణను అడ్డుకోవాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మద్యం దుకాణాలు మూసివేసేందుకు ఇప్పటికే ఆదేశాలిచ్చామని.. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు అవే కొనసాగుతాయన్నారు.
భద్రతా ఏర్పాట్లు పూర్తి: ఎస్పీ
విజయవాడ రెవెన్యూ సబ్డివిజన్లో జరగనున్న పంచాయతీ ఎన్నికలకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ రవీంద్రనాథ్ బాబు తెలిపారు. ఆయా గ్రామాల్లో పర్యటించి.. నాలుగు విడతలుగా జరిగే స్థానిక ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు. 2,916 మందిని బైండోవర్ చేసినట్లు వెల్లడించారు. 386 ప్రాంతాలను అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించామన్నారు. తమ సిబ్బంది క్షేత్ర స్థాయిలో పర్యటించి.. ప్రజలు అక్కడ ఓటు వేసే దిశగా అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. మద్యం, నగదు రవాణాను అరికట్టేందుకు.. జిల్లాలో 60 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. కంచికచర్లలో నిన్న రాత్రి ద్విచక్రవాహనం తగలబెట్టిన ఘటనపై అధికారులు సమాచారాన్ని సేకరిస్తున్నారని వివరించారు.
జోరుగా ప్రచారం
మైలవరంలో... అధికార, ప్రతిపక్ష పార్టీలతో పాటు జనసేన, భాజపాలు భారీ ర్యాలీలు ఏర్పాటు చేసి.. రాజకీయ ఉత్కంఠకు తెర తీశాయి. పాగా వేయటానికి వైకాపా, బలం చాటుకోవటానికి జనసేన-భాజపా, పట్టు నిలుపుకోవటానికి తెదేపా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. కంచికచర్లలో... వైకాపా బలపరిచిన సర్పంచి, వార్డు సభ్యులను గెలిపించాలని.. ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు ప్రచారం చేశారు. వత్సవాయి మండలం తాళ్లూరులో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో జనం పోటెత్తారు. విజయవాడ తెదేపా పార్లమెంటు అధ్యక్షులు నెట్టెం శ్రీ రఘురాం, ఆ పార్టీ జాతీయ కోశాధికారి శ్రీరాం రాజగోపాల్ తాతయ్య.. అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు.
పోస్టల్ బ్యాలెట్ తో...
తోట్లవల్లూరులో... ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు.. తోట్లవల్లూరు ఎంపీడీవో కార్యాలయంలో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అంగన్వాడీ ఉపాధ్యాయులు, మండలంలోని ఉద్యోగస్థులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా పోలింగ్లో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: