వచ్చే నెల 15 నుంచి 30 మధ్య ప్రయోగాత్మక పరిశీలన (ట్రయల్రన్) నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వంతెన నిర్మాణంపై జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, జిల్లా మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ ఇటీవల సమీక్షించారు. ఈ వంతెన ప్రారంభోత్సవాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్రెడ్డితో చేయించాలని భావిస్తున్నారు.
దాదాపు అయిదేళ్ల తర్వాత విజయవాడ నగర వాసుల కల తీరబోతోంది. ప్రధానంగా వన్టౌన్లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పడనుంది. నగరం నుంచి భారీ వాహనాలు వెళ్లేందుకు అవకాశం ఏర్పడింది. రూ.311 కోట్లతో ఈప్రాజెక్టును సోమా ఎంటర్ప్రైజెస్ సంస్థ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.110 కోట్లు వెచ్చించింది. మిగిలిన వ్యయం కేంద్ర ప్రభుత్వం భరించింది.
పైవంతెన మొత్తం కాంట్రాక్టు రూ.288.4 కోట్లు మాత్రమే. అదనంగా కృష్ణలంక వద్ద అండర్పాస్, మున్సిపల్ కార్పొరేషన్ వద్ద వయాడక్టు నిర్మాణం, రిటైనింగ్ వాల్, సర్వీసు రోడ్డు, ఇతర అదనపు పనుల కోసం దాదాపు రూ.30 కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించింది. కాంట్రాక్టు వ్యయంలో దాదాపు రూ.12 కోట్లు మిగులు ఉండగా, అది కేంద్ర ఖాతాలో జమ అవుతోంది. రాష్ట్రంపై మాత్రం అదనపు భారం పడింది.
వర్షాలు లేకపోతే.. ఆటంకం లేదు
2015లో చేపట్టిన ఈ పనులు దాదాపు అయిదేళ్ల తర్వాత పూర్తయినట్లయింది. ఎక్స్పాన్షన్ జాయింట్లు, డ్రెయిన్ల నిర్మాణం, విద్యుదీకరణ, పెయింటింగ్ పనులు మిగిలిపోయాయి. వర్షాలు కురవకపోతే ఆటంకం లేకుండా పనులు పూర్తి చేసే అవకాశం ఉండేదని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అక్కడక్కడ మెరుగులు దిద్దే కార్యక్రమాలు జరుగుతున్నాయి. కుమ్మరిపాలెం వైపు భూసేకరణకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపనున్నారు.
ప్రయోగాత్మక పరిశీలన..!
రాష్ట్రంలో ప్రథమంగా సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ఆరు వరుసలతో ఈ వంతెనను నిర్మించారు. ప్రస్తుతం పైవంతెనపై తారు వేస్తున్నారు. మరో రెండు రోజుల్లో ఇది పూర్తి కానుంది. అనంతరం ఇతర పనులు పూర్తి చేసి 20, 40, 50 టన్నులు భారీ వాహనాలను నడిపే విషయాన్ని పరిశీలన చేస్తున్నారు. ఇప్పటికే క్వాలిటీ కంట్రోల్ విభాగం పరీక్షలు నిర్వహించింది. పటిష్ఠత పరీక్షలు పూర్తయిన తర్వాత ప్రయోగాత్మక పరిశీలన ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
చెన్నై నుంచి హైదరాబాద్, ఛత్తీస్గఢ్ జాతీయ రహదారి వైపు వెళ్లే వానాలను ఈ వంతెనపైకి మళ్లిస్తారు. సెప్టెంబరు నుంచి సాధారణ ట్రాఫిక్కు అందుబాటులోకి రానుంది. పైవంతెన నిర్మాణం పూర్తయిందని ఆగస్టు 15 నుంచి ట్రాఫిక్ను వదిలి ప్రయోగాత్మక పరిశీలన జరుపుతామని, అదనపు భూసేకరణపై కేంద్రానికి నివేదిస్తున్నామని అధికారులు వివరించారు.
ఇదీ చదవండి: