Pawan Kalyan comments: మహిళలకు రక్షణ ఇవ్వలేని పాలన ఎందుకని జనసేన అధినేత పవన్ కల్యాన్ ప్రశ్నించారు. ఆడబిడ్డలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నా.. ముఖ్యమంత్రి ఎందుకు మౌనం వహిస్తున్నారని నిలదీశారు. మహిళపై అత్యాచారాలు, అఘాయిత్యాలకు సంబంధించిన కేసుల్లో ఏపీ మొదటి పది స్థానాల్లో ఉందని.. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో లెక్కలు చెబుతున్నా.. ప్రభుత్వం మౌనంగా, ఉదాసీనంగా ఉండటం ఆడబిడ్డలకు శాపంగా మారిందని ఆయన విమర్శించారు. ఉత్తరాంధ్ర అచ్యుతాపురం సెజ్ లో ఉపాధి కోసం వచ్చిన గిరిజన మహిళపై, నాగార్జున సాగర్ దగ్గర ఆశా కార్యకర్తగా ఉన్న గిరిజన మహిళపై జరిగిన అత్యాచారం, హత్య ఘటనలు కలచివేశాయన్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మహిళల మానమర్యాదలకు భంగం వాటిల్లే సంఘటనలు రాష్ట్రంలో తరచూ చోటు చేసుకొంటున్నా.. పాలకులు పట్టించుకోకపోవడంతో నేరగాళ్లు రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. దిశా చట్టాలు చేశాం.. పోలీస్ స్టేషన్లు పెట్టాం అని ప్రచార ఆర్భాటం తప్ప ఆడబిడ్డలకు మాత్రం ధైర్యం ఇవ్వలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం ఇంటి సమీపంలో కృష్ణా నది ఒడ్డున ఓ యువతిపై అత్యాచారం జరిగి ఏడాది దాటినా ఇప్పటికీ నిందితున్ని పట్టుకోలేకపోయారని ధ్వజమెత్తారు. ఈ ఘటనలను చూసి రాష్ట్రంలో పోలీసింగ్, శాంతిభదత్రల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చని విమర్శించారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న నేరాలు రోజురోజుకీ పెరగటం కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని పవన్కల్యాణ్ మండిపడ్డారు.
ఇవీ చదవండి: