కొవిడ్ దృష్ట్యా వివిధ ప్రభుత్వ కాంట్రాక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలోనూ నిబంధనల్ని సడలిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి కాంట్రాక్టు అంచనా విలువ నుంచి 2.5 శాతం బదులుగా 1 శాతం మాత్రమే ఈఎండీగా వసూలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న పనుల్లోనూ గతంలో వసూలు చేసిన 2.5 శాతం మొత్తం నుంచి కాంట్రాక్టు విలువలో 1.5 శాతాన్ని కాంట్రాక్టర్లు, ఏజెన్సీలకు తిరిగి చెల్లించాల్సిందిగా సూచనలు జారీ చేశారు. మిగిలిన ఒక్క శాతం ఈఎండీ మొత్తాన్ని పనులు పూర్తి అయ్యాక చెల్లించాలని ప్రభుత్వం ఆదేశాల్లో ప్రభుత్వం పేర్కొంది.
సెక్యూరిటీ డిపాజిట్గా వసూలు చేస్తున్న 7.5 శాతం బదులుగా 2 శాతం మొత్తాన్ని మాత్రమే తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ వెసులుబాటును ప్రస్తుత కాంట్రాక్టులతోపాటు 31 డిసెంబరు 2021 వరకూ కుదుర్చుకోనున్న ఒప్పందాలకు అమలు చేయాలని స్పష్టం చేసింది. ఈ వెసులుబాటు 2023 మార్చి 31 తేదీ వరకూ అమల్లో ఉంటుందని ఆర్థికశాఖ తెలిపింది.
ఇదీ చదవండి: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల