రాష్ట్రవ్యాప్తంగా పెట్రోలియం డీలర్లు.. ఈనెల 31న చమురు కంపెనీల నుంచి కొనుగోలు నిలిపివేయాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గించడంతో డీలర్లు తీవ్ర నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజీల్ ధరలను క్రమం తప్పకుండా పెంచుతూ వెళ్లిందని.. ఇప్పుడు ఉన్న పళంగా రూపాయల్లో తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడంతో పెట్రోల్ బంకుల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. విజయవాడలో పెట్రోలియం డీలర్ల సమాఖ్య ఆధ్వర్యంలో డీలర్ల ప్రత్యేక సమావేశం జరిగింది.
కొన్ని చమురు కంపెనీలు తమ నిర్వహణలోని బంకులకు పూర్తిస్థాయిలో నిల్వలు కేటాయిస్తూ.. ఇతర బంకులకు కోటా విధానం అమలు చేస్తుండటం అన్యాయం అని డీలర్ల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రావి గోపాలకృష్ణ పేర్కొన్నారు. కరోనా క్లిష్ట పరిస్థితుల్లోనూ డీలర్లు రేయింబవళ్లు సేవలందించారని.. 2017 నుంచి చమురు కంపెనీలు డీలరు మార్జిన్ విషయంలో ఎలాంటి మార్పులు చేయకపోవడం దురదృష్టకరమన్నారు. అపూర్వ చంద్ర కమిటీ సిఫార్సులు... డీలర్ల సమావేశాల్లో చేసుకున్న ఒప్పందాలను సైతం చమురు కంపెనీలు ఉల్లంఘించాయని డీలర్ల సమాఖ్య ఆరోపించింది. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరల్లో మార్పులు జరిగినప్పుడు అందుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం, చమురు కంపెనీలు నిర్ణయాలు తీసుకోలేదని పేర్కొన్నారు. ఫలితంగా నష్టాల్లో కూరుకుపోతున్నామని తెలిపారు.
ఎక్సైజ్ డ్యూటీ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని.. ఫలితంగా వినియోగదారులపై కొంత భారం తగ్గడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. ఇదే సమయంలో ప్రభుత్వం, చమురు కంపెనీల ఆకస్మిక నిర్ణయాల కారణంగా డీలర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోకపోవడం పట్ల తీవ్ర ఆందోళన చెందుతున్నామన్నారు. డీలర్లకు ఎప్పటికప్పుడు పెంచాల్సిన మార్జిన్ పెంచకపోగా... నిత్యం వ్యాపారంలో ఉండాల్సిన మూలధన పెట్టుబడి, కరెంటు ఛార్జీలు, జీత భత్యాలు, వ్యాపార నిర్వహణకు దైనందిక ఖర్చులు వంటివి రోజురోజుకూ పెరుగుతున్నాయన్నారు. వినియోగదారులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా.. ఈనెల 31న అన్ని చమురు కంపెనీల నుంచి కొనుగోలు నిలిపివేసి తమ నిరసన తెలియజేస్తామన్నారు. అప్పటికీ చమురు కంపెనీలు స్పందించకపోతే దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతామన్నారు.
ఇదీ చదవండి: