రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ త్యాగాలకు గుర్తుగా అమరావతి అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుతోపాటు స్మృతివనం నిర్మాణానికి గత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2017 ఏప్రిల్లో దీనికి శంకుస్థాపన సైతం చేశారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ఈ స్మృతివనం నిర్మాణ ప్రాజెక్ట్ సైతం అటకెక్కింది. అయితే తాజాగా ప్రభుత్వం విజయవాడ స్వరాజ్ మైదానంలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో తెలుగుదేశం నేతలు ఆందోళబాట పట్టారు. విజయవాడలో విగ్రహం పెట్టినా అమరావతిలో అంబేడ్కర్ స్మృతివనాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇవాళ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని ఆపార్టీ దళిత నేతలు సందర్శించనున్నారు.
స్థలాన్ని ఎలా కేటాయిస్తారు?
కోర్టు వివాదాల్లో ఉన్న స్వరాజ్ మైదానంలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామనడంపై తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. జలవనరులశాఖకు చెందిన ఈ స్థలాన్ని సాంఘిక సంక్షేమశాఖకు కేటాయించడాన్ని తెలుగుదేశం తప్పుబట్టింది. విగ్రహం ఏర్పాటుపై ప్రభుత్వనికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వివాదస్పద స్థలాన్ని ఎందుకు ఎన్నుకుందని నేతలు ప్రశ్నించారు. సీఎం ప్రత్యేక చొరవ చూపి స్థల వివాదాన్ని పరిష్కరించాలన్నారు.
స్మృతివనం వద్ద నిరసనలు
స్వరాజ్ మైదానాన్ని మూడు భాగాలుగా చేసి రెండు భాగాల్లో అంబేడ్కర్ విగ్రహం, ఒక భాగంలో బాబూ జగజ్జీవన్రామ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నారు. గత ప్రభుత్వం అమరావతిలో విశాలమైన 20 ఎకరాల స్థలాన్ని ఇవ్వడంతోపాటు స్మృతివనానికి వందకోట్లు కేటాయించిందన్నారు. ఇప్పటికే ఐనవోలులో విగ్రహ ఏర్పాటుకు సంబంధించిన 22 శాతం పనులు పూర్తయ్యాయన్నారు.
ఎన్టీఆర్ భవన్లో సమావేశం కానున్న తెలుగుదేశం పార్టీ దళిత నేతలు అంబేడ్కర్ స్మృతి వనం ఏర్పాటుపై చర్చించనున్నారు. అనంతరం అక్కడ నుంచి ఐనవోలులో శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించి నిరసన తెలపనున్నారు.
ఇదీ చదవండి : ఇస్రో ప్రైవేటీకరణ సరికాదు.. ఉపసంహరించుకోవాలి: నారాయణ