గుంటూరు జిల్లా తాడేపల్లిలోని డీజీపీ కార్యాలయ ముట్టడికి భాజపా పిలుపునివ్వడంపై పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ పార్టీ నాయకులను, కార్యకర్తలను ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, సీనియర్ నేతలు విష్ణువర్ధన్రెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ , పాతూరి ఇళ్ల వద్ద పికెటింగ్ ఏర్పాటు చేశారు. మరోవైపు.. ఎంపీ రమేశ్ను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చలో డీజీపీ కార్యాలయానికి అనుమతి లేదని నోటీసులు ఇచ్చారు.
'విగ్రహాల ధ్వంసానికి కారకులు ఎవరు?'
ప్రభుత్వ అండదండలతోనే విగ్రహాల ధ్వంసం జరుగుతున్నాయని భాజపా సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజాస్వామ్యం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు వ్యవస్థ అధికార పార్టీ చెప్పినట్లు నడుచుకోవటం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని విమర్శించారు. విగ్రహాల ధ్వంసానికి కారకులు ఎవరో ప్రభుత్వం వారం లోగా చెప్పాలని డిమాండ్ చేశారు.
డీజీపీ కార్యాలయం వద్ద పోలీసు భద్రత
అమరావతి కరకట్ట మార్గాన ఉన్న అతిథిగృహంలో భాజపా రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణాన్ని పోలీసులు నిర్బంధించారు. విజయవాడలో తన నివాసంలో ఉన్న నాగభూషణాన్ని విజయవాడ పోలీసులు.. తాడేపల్లి తరలించి ఆయన అతిథి గృహంలో నిర్బంధించారు. అతిథి గృహం బయట గుంటూరు, విజయవాడ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మంగళగిరిలో ధర్నాకు ఉపక్రమించిన భాజపా కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. డీజీపీ కార్యాలయంవద్ద భారీ పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లా జి.కొండూరు మండలం కట్టుబడిపాలెం వద్ద చెక్ పోస్టు ఏర్పాటు చేసి.. భాజపా నేతలు ఎవరు ధర్నాకు వెళ్లకుండా వాహనాలు తనిఖీలు చేస్తున్నారు.
ఇదీ చదవండి: