జనాభా ప్రాతిపదికగా విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్కు రూ.100 కోట్లు నిధులు ఇచ్చి.. ఆర్థికంగా వెనుకబడిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం ఫెడరేషన్ మాజీ డైరెక్టర్ గోడి నరసింహాచారి కోరారు. అజిత్సింగ్ నగర్లో ఆ సంఘం 9వ మహాసభ ఎన్నికల నిర్వహణ సన్నాహక సమావేశం జరిగింది. 1973లో 563 జీవో ప్రకారం ఏర్పడిన ఈ సంస్థకు ఫిబ్రవరిలో ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు. నిర్వహణ అధికారిగా ధనాలకోట కాళేశ్వరరావు వ్యవహరించనున్నారని పేర్కొన్నారు. విశ్వబ్రాహ్మణ సంఘంలోని కంచర, కుమ్మర, వడ్రంగి, శిల్పాలు, స్వర్ణ వృత్తుల వారికి ప్రభుత్వం రూ.10వేలు భత్యం అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనేక చేతివృత్తులు ఇప్పటికే కనుమరుగవుతున్నాయని.. సర్కారు పట్టించుకోకపోతే ఉన్నవాటి ఉనికి సైతం ప్రశ్నార్థకంగా మారే అవకాశముందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో 20లక్షల మందికి పైగా విశ్వబ్రాహ్మణులు ఉన్నారన్నారు. 7 లక్షల మందే ఉన్నారని ప్రభుత్వానికి కొంతమంది తప్పుడు నివేదిక ఇచ్చారన్నారు. త్వరలోనే అన్ని జిల్లాలు, మండలాల వారీగా సర్వే నిర్వహిస్తున్నామని.. నివేదికలను, జనాభా సంఖ్యను సీఎంకు తెలియచేస్తామని ప్రకటించారు.
విశ్వబ్రాహ్మణులంతా ఐక్యంగా ఉండి.. రావాల్సిన హక్కులను ప్రభుత్వం నుంచి రాబట్టుకోవాలని 9వ మహాసభ ఆహ్వాన సంఘం ఛైర్మన్ చేవూరి రామస్వామి పేర్కొన్నారు. చేతివృత్తులను నమ్ముకుని ఎంతోమంది జీవిస్తున్నారని.. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు.ఫిబ్రవరి నెల మొదటి వారంలో ఎన్నికలు జరుపనున్నట్లు తెలిపారు. ఈ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఆయా జిల్లాల అధ్యక్ష, కార్యదర్శుల సహకారం అవసరమన్నారు. త్వరలో జరుగనున్న జిల్లాల విభజనలో.. కడపలోని కొంత భాగాన్ని వీరబ్రహ్మేంద్ర స్వామి జిల్లాగా ఏర్పాటుచేస్తే బాగుంటుందని సర్కారుకి సూచించారు.
ఐక్యతగా ఉంటేనే ఏదైనా సాధించుకోగలమని ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం విశ్వకర్మ ఐకాస ఛైర్మన్ పావులూరి హనుమంతరావు పేర్కొన్నారు. ఎన్నికలు ప్రజాస్వామ్యబద్దంగా జరిగేందుకు అందరూ సహకరించాలని ఎన్నికల అధికారి ధనాలకోట కాళేశ్వరరావు కోరారు. సన్నాహక సమావేశంలో కొన్ని సూచనలు అందాయని.. వాటిని పరిగణలోకి తీసుకుని ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో సంఘం సభ్యులు, 13 జిల్లాల విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'స్వరూపానంద విషయంలో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు సరైనవే'