భారతీయ జనతా పార్టీ కేంద్రంలో రెండోసారి పగ్గాలు చేపట్టి ఏడాది పూర్తైంది. ఈ ఏడాది కాలంలో ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు, దేశాభివృద్ధికి ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని భాజపా అధిష్ఠానం భావిస్తోంది. పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వ పనితీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలని యోచిస్తుంది. కరోనా వ్యాప్తిస్తున్న కారణంగా ప్రచార ర్యాలీ సాధ్యం కాదని భావించిన భాజపా... వర్చువల్ ర్యాలీలకు శ్రీకారం చుట్టింది. వర్చువల్ ర్యాలీ ద్వారా ప్రచార కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ నెల ఏడో తేదీన భాజపా మాజీఅధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వర్చువల్ ర్యాలీలను లాంఛనంగా ప్రారంభించారు.
తొలి మూడు ర్యాలీలను ఒడిశా, బిహార్, పశ్చిమ్ బంగలో నిర్వహించారు. నాలుగో ర్యాలీని దక్షిణ భారత దేశంలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లో నిర్వహించేందుకు భాజపా శ్రేణులు ఏర్పాట్లు పూర్తిచేశాయి. విజయవాడలోని వెన్యూ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించనున్న వర్చువల్ ర్యాలీకి సంబంధించి ఏర్పాట్లను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పరిశీలించారు. బుధవారం ప్రారంభించబోయే ఈ తొలి ర్యాలీలో భాజపా జాతీయస్థాయి నాయకుడు రాంమాధవ్, కన్నా లక్ష్మీనారాయణ, రాష్ట్ర నాయకులు పాల్గొంటారు. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమలో మొత్తం మూడు ర్యాలీలను నిర్వహించాలని భాజపా నిర్ణయించింది. తొలి ర్యాలీని విజయవాడలో నిర్వహిస్తున్నట్లు భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.
రాష్ట్రంలో వర్చువల్ ర్యాలీల నిర్వహణకు 6 విభాగాలు ఏర్పాటు చేశారు. 30 రోజుల పాటు ఈ 6 విభాగాలు కేంద్రం ఏడాది పాలనలో సాధించిన విజయాలు, ప్రవేశపెట్టిన పథకాలను రాష్ట్ర ప్రజలకు వివిధ మార్గాల ద్వారా వివరిస్తారు. కరపత్రాలు, వీడియోలు, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయనున్నారు.
ఇదీ చదవండి : అధికారులపై వైకాపా నేత ఆగ్రహం.. సచివాలయానికి తాళం