తిరుమల కొండపై ఏళ్లనాటి నుంచి తిష్టవేసిన దళారులను కొండ దింపేందుకు తితిదే చర్యలు ప్రారంభించింది. తిరుమలేశుని దర్శించుకునేందుకు వీఐపీ బ్రేక్ దర్శనం, ఆర్జిత సేవా టిక్కెట్ల కోసం పరితపిస్తూ ఖర్చుకు వెనుకాడరు. తమకు మంచి దర్శనం కలిగితే చాలు అనే ధోరణిలో భక్తుల నుంచి అందిన కాడికి దండుకుంటున్నారు దళారులు. ఇలా ఏళ్లనాటి నుంచి కొందరు అక్రమార్కులు ప్రజా ప్రతినిధులు, బడా నేతల పీఆర్వోలమంటూ సిఫార్సు లేఖలతో దందాలు సాగిస్తున్నారు. వీరికి కొందరు ఇంటి దొంగలు తోడై వీఐపీ బ్రేక్ దర్శన టిక్కెట్లు, ఆర్జిత సేవా టిక్కెట్లు, అద్దె గదులు, శ్రీవారి ప్రసాదాలు సులభంగా ఇచ్చేస్తున్నారు.
గతంలో తిరుమలలో పని చేసిన ధర్మారెడ్డి... ప్రత్యేకాధికారిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రక్షాళన మొదలైంది. అక్రమాలు చేసేందుకు అడ్డూ అదుపూ లేకుండా ఉన్న ఎల్-1, ఎల్-2 దర్శనాలు రద్దు చేశారు. విజిలెన్స్ అధికారులతో సమావేశమై దళారీ వ్యవస్థ అరికట్టాలని ఆదేశించారు. ఇంటి దొంగలపై దృష్టి పెట్టిన విజిలెన్స్ టిక్కెట్లు జారీ చేసే జేఈవో కార్యాలయం, ఛైర్మన్ కార్యాలయంలో ఆవినీతిపరులపై చర్యలు తీసుకున్నారు.
తెలంగాణా రాష్ట్రం సిరిసిల్లకు చెందిన భక్తులకు 2 కళ్యాణోత్సవం టిక్కెట్లు ఇప్పిస్తానంటూ మోసగించిన దళారీ పరంధామయ్యను పట్టుకున్నారు. అతని వద్ద అధికార పార్ఠీనేతల సిఫార్సు లేఖలు గుర్తించారు. అతనిచ్చిన సమాచారంతో దళారీల ఫోన్ నెంబర్ల ఆధారంగా బుధవారం మరో 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న ఇంకొందర్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సిఫార్సు లేఖలతో జేఈవో కార్యాలయానికి వచ్చే యాత్రికుల నుంచి పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. దర్శనం టిక్కెట్లు మంజూరైన వారు దర్శనంకు వెళ్లే సమయంలోనూ వైకుంఠం క్యూకాంప్లెక్స్లో టిక్కెట్లు ఎలా పొందారనే సమాచారం ఆరా తీస్తున్నారు. ఇలా వచ్చిన సమాచారంతో గురువారం మరో ఐదుగురు దళారులను అదుపులోకి తీసుకుని రహస్యంగా విచారిస్తున్నారు. దళారులపై తితిదే కఠినంగా వ్యవహరిస్తుండటంతో మోసపోయిన భక్తులు తితిదేకు అక్రమార్కుల సమాచారం అందజేస్తున్నారు.