పవిత్ర రంజాన్ మాంసంలో ఇష్టంగా తినే బలవర్దక ఆహారంలో హలీం ఒకటి. ఎన్నో ఏళ్లుగా ముస్లింలు హలీంను సంప్రదాయ వంటకంగా తీసుకుంటుంటారు. కాలక్రమంలో అంతా హలీం రుచికి అలవాటుపడి రంజాన్ పండుగ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తుంటారు. ఏటా హలీం వంటకానికి కోట్ల రూపాయల్లో వ్యాపారం జరుగుతోంది. హైదరాబాద్లో తయారైన హలీంకు విదేశాల్లోనూ మంచి డిమాండ్ ఉంది. పాతబస్తీలోని పిస్తా హౌజ్ నుంచి ఎగుమతి అవుతుంది.
కానీ పరిస్థితి ఈ సారి అలా ఉండదు. ఈ రంజాన్ మాంసంలో పూర్తిగా హలీం తయారీ నిలిపేస్తున్నట్టు హైదరాబాద్లోని హలీం తయారీదారుల సంఘం ఏకగ్రీవంగా నిర్ణయించింది. తెలంగాణలో వైరస్ వ్యాప్తి దృష్ట్యా హలీం తయారు చేసే వివిధ హోటల్స్, ఫుడ్ కోర్టులు, ఔట్లెట్స్లోని సుమారు 400 మంది సభ్యులతో చర్చించిన తయారీదారుల సంఘం... హలీం తయారు చేయకూడదని తీర్మానించింది. ఈ ఏడాది ఎలాంటి తయారీ, ఎగుమతులు ఉండవని పిస్తా హౌస్ గ్రూపు ఛైర్మన్ ఎంఏ మాజిద్ స్పష్టం చేశారు.
కరోనా వ్యాప్తి దృష్ట్యా హలీం తయారీ, అమ్మకం చాలా ప్రమాదంతో కూడుకున్నదని భావిస్తున్న తయారీదారులు... విక్రయాల సమయంలో ఎవరికి కరోనా ఉందో? ఎవరికి లేదో? తెలుసుకోవడం అసాధ్యమని పేర్కొన్నారు. పైగా భౌతికదూరం పాటించడం కుదరదని భావించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్లుగా డబ్బుపోతే మళ్లీ సంపాదించుకోవచ్చు... ప్రాణాలు పోతే తిరిగి రావన్న ఉద్దేశంతో ఈ రంజాన్కు హలీం తయారీ పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
ఇదీ చూడండి: గుప్పెడు మెతుకుల కోసం.. పేదల నిరీక్షణ