పసుపు రైతులు పండించిన పంటకు కనీస మద్ధతు ధర కల్పించేందుకు... సీఎం జగన్తో చర్చిస్తామని ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా హామీఇచ్చారు. కడప నగరంలోని వ్యవసాయ మార్కెట్ యార్డును ఆయన తనిఖీ చేశారు. ఈ యార్డుకు జిల్లా నుంచి ఎక్కువగా వేరుశనగ, పసుపు పంట మాత్రమే వస్తోందని అధికారులు ఉపముఖ్యమంత్రికి వివరించారు. పసుపు పంటకు మద్ధతు ధర లేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన అంజద్ బాషా అధికారులను అడిగి రైతుల పరిస్థితిపై వాకబు చేశారు.
వేరుశనగ పంటకు మద్ధతు ధర లభించినా... పసుపు పంటకు మాత్రం ధర లేనట్లు తెలుస్తోందని ఉప ముఖ్యమంత్రి అన్నారు. మద్ధతు ధర లేకపోవడం కారణంగా ఏటా కడప జిల్లాలో 6వేల ఎకరాల్లో పసుపు సాగు చేసే రైతులు... ఈసారి 3వేల ఎకరాల్లోనే సాగు చేశారని గుర్తు చేశారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. పసుపు రైతులకు న్యాయం చేస్తారనే ఆశాభావంతో ఉన్నామని అంజద్ బాషా అన్నారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో కోల్డ్ స్టోరేజీ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండీ... ఏ పని కావాలన్నా 72 గంటల్లోనే చేస్తాం