TDP Leaders fired on CM Jagan: రాజధాని అమరావతి విషయంలో మాట తప్పిన సీఎం జగన్ మోహన్ రెడ్డి రాజీనామా చేసి ప్రజాతీర్పు కోరాలని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు డిమాండ్ చేశారు. అమరావతి రాజధాని కోసం త్యాగం చేసిన రైతులను మోసం చేస్తే జగన్మోహన్ రెడ్డిని చరిత్ర క్షమించదని అన్నారు.
పోస్టులు రద్దు చేసి.. పొట్ట కొట్టారు -టీడీఎల్పీ విప్ డోలా : ప్రతి ఏటీ డీఎస్సీ నిర్వహిస్తానని మాట ఇచ్చిన జగన్ రెడ్డి.. 3 ఏళ్లుగా మాట తప్పి, మడమ తిప్పారని టీడీఎల్పీ విప్ డోలా బాల వీరాంజనేయస్వామి విమర్శించారు. 20వేల ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయకుండా.. 4,764 ఎస్జీటీ పోస్టులను రద్దుచేయడం హేయమని ధ్వజమెత్తారు. ఉపాధ్యాయుల చేత మొన్న మద్యం అమ్మించిన జగన్.. నిన్న రోడ్డు ఎక్కించారని, నేడు పోస్టులు రద్దు చేసి పొట్టకొట్టారని మండిపడ్డారు. అక్రమ బదిలీలను ప్రశ్నించినందుకు లాఠీ చార్జ్ చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు-నేడు పనుల ఒత్తిడికి ఉపాధ్యాయులను బలిగొన్నారని దుయ్యబట్టారు. కరోనా సమయంలో లక్షలాది మంది ప్రైవేట్ టీచర్లను రోడ్డున పడేశారని విమర్శించారు. 3, 4, 5 పాఠశాలల విలీనం పేరుతో మరిన్ని పోస్టులను రద్దు చేసేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. ఎయిడెడ్ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. పీజీ విద్యార్ధులకు ఫీజ్ రీయంబర్స్ మెంట్ ను రద్దు చేసి విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారని డోలా ఆక్షేపించారు.
ప్రజలను పీడించి ఖజానా నింపుతున్నారు - సయ్యధ్ రఫీ : ల్యాండ్ సీలింగ్ యాక్ట్ 36 జీవో పేరుతో జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలను పీడించి ఖజానా నింపుకోవాలనుకోటం దుర్మార్గమని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యధ్ రఫీ ధ్వజమెత్తారు. కోర్టు ఎన్ని మొట్టికాయలు వేసినా.. పద్దతి మార్చుకోకుండా పన్నులు మీద పన్నులు విధించి జగన్ రెడ్డి ప్రజలపై భారం మోపుతున్నారని మండిపడ్డారు. 2008లో జీవో 747 ద్వారా రద్దయిన ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ను మళ్లీ 36 జీవో ద్వారా తెరపైకి తెచ్చి ప్రజల డబ్బులు గుంజేందుకు జగన్ రెడ్డి ప్రభుత్వం తెగబడిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. చెత్తపన్ను, ఇంటి పన్ను, డ్రైనేజీ పన్ను, వన్ టైం సెటిల్ మెంట్ పేరుతో పేదల ఇళ్లపై పన్ను, అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తో క్రమబద్దీకరణ పన్నుకు పాల్పడ్డారని ఆరోపించారు.
ఇదీ చదవండి : వక్రభాష్యాలతో ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు: కనకమేడల