కరోనా మహమ్మారిపై పోరులో ముందు వరుసలో ఉన్న ఉద్యోగుల సేవలను విస్మరించరాదని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. కరోనా బారిన పడిన ప్రతీ ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగికి వేతనంతో కూడిన నాలుగు వారాల ప్రత్యేక సెలవు మంజూరు చేయాలని కోరారు. ప్రైవేటు సంస్థల యాజమాన్యాలు కూడా ఈ విషయంలో సానుభూతితో ఆలోచించాలని సూచించారు.
కరోనా పేరు వింటేనే ప్రతి ఒక్కరూ వణికిపోయే పరిస్థితుల్లో... ఆ వైరస్ బారిన పడినవారికి సేవలందిస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు పూర్తి అండగా ఉండాలని పవన్ అన్నారు. ఇప్పటివరకు ఏపీలో 200 మంది వైద్య సిబ్బంది, 600 మంది పోలీసులు కరోనా బారినపడినట్టు తెలుస్తోందన్నారు. ప్రాణాలను కూడా లెక్కచేయకుండా రోగులకు సేవలు అందిస్తున్న వారి త్యాగాన్ని ప్రభుత్వం గుర్తించాలని పవన్ కోరారు. కొవిడ్ విధుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలని.. వారి కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: వివేకా హత్య కేసుపై సీబీఐ విచారణ ప్రారంభం