తూర్పుగోదావరి జిల్లా సీతానగరం పోలీస్ స్టేషన్లో వరప్రసాద్ అనే దళిత యువకుడికి శిరోముండనం చేసి, తీవ్రంగా కొట్టడం ప్రజాస్వామ్యానికే తల ఒంపులు తీసుకువచ్చిందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. బాధ్యత కలిగిన పోలీసులు ఇలాంటి అనాగరిక చర్యల్లో భాగస్వామ్యం కావడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతోనే పోలీసులు ఈ పనులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇసుక అక్రమ రవాణా చేసే లారీలతో ప్రమాదాలు జరుగుతుండటంతో సీతానగరం ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారన్నారు. ప్రమాదానికి కారణమైన ఇసుక లారీని నిలువరించిన దళితులపై అక్రమ కేసులు బనాయించడమే కాకుండా, ఓ యువకుడికి శిరోముండనం చేసి అవమానించడాన్ని తీవ్రంగా పరిగణించాలన్నారు.
ఇసుక మాఫియాను అరికట్టకుండా, దానిని ప్రశ్నించిన వారిని హింసించడం ప్రభుత్వ నియంతృత్వ పోకడకు అద్దం పడుతోందని వ్యాఖ్యానించారు. ఈ కేసులో బాధ్యులైన పోలీసులను సస్పెండ్ చేయడంతో సరిపోదని... దీనికి పోలీసులను ప్రేరేపించిన అధికార పక్ష నాయకులను కూడా బాధ్యులను చేసి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దళితులపై, దళిత ఉద్యోగులపై దాడులు పెరగడాన్ని, వారిపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్న తీరునీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు.
ఇదీ చదవండి : సీతానగరం ఘటనపై భగ్గుమన్న ప్రతిపక్షాలు