గుంటూరు నగరంలోని అడవి తక్కెళ్లపాడులో 12 సంవత్సరాల క్రితం రాజీవ్ గృహకల్ప పథకం కింద పేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చారు. మొత్తం 35 బ్లాకులను నిర్మించగా... ఒక్కో బ్లాక్ల్లో 32 చొప్పున.. దాదాపు వెయ్యి కుటుంబాలు నివసిస్తున్నాయి. అయితే నివాస సముదాయాలు నిర్మించిన ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పన, వాటి నిర్వహణను మాత్రం విస్మరించింది. ముఖ్యంగా వర్షాకాలం వస్తే చాలు ఇక్కడ డ్రైనేజిలు పొంగి పొర్లుతున్నాయి.
ఇటీవల వర్షాల కారణంగా డ్రైనేజిలలో పూడిక పేరుకుపోయింది. దీంతో మురుగునీరు ఎక్కడపడితే అక్కడ పొంగి బయటకు ప్రవహిస్తోంది. నివాస సముదాయాలను మురుగు చుట్టుముట్టింది. విపరీతమైన దుర్గంధంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని బ్లాకుల వద్ద ఇళ్లలోని వారు బయటకు వచ్చేందుకు కూడా వీల్లేదు. ఒకవేళ రావాలంటే మురుగులో నడుస్తూ రావాలి. దోమలు, విషపురుగులు చేరి ప్రజల్ని మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. చిన్న పిల్లలు జ్వరం బారిన పడుతున్నారు. నగరపాలక సంస్థ అధికారులకు సమస్య విన్నవించినా పరిష్కారం కాలేదని స్థానికులు చెబుతున్నారు.
పట్టని పాట్లు
కొన్ని బ్లాకుల్లో అయితే మురుగునీరు విద్యుత్ మీటర్ల బాక్సుల వద్దకు చేరింది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అసలే కరోనా కారణంగా నిత్యం భయపడుతూ కాలం వెళ్లదీస్తున్న సమయంలో మురుగు కారణంగా వేరే రోగాలు వస్తే పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ ఇళ్లు నిర్మించి పుష్కర కాలం దాటినా సరైన మౌలిక వసతులు లేవని, ఇప్పటికీ సరైన రహదారులు నిర్మించలేదని స్థానికులు అంటున్నారు. వర్షం వస్తే బురదతో ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. మంచినీటి సదుపాయం కూడా సరిగ్గా లేదంటున్నారు.
నిర్వహణ లోపంతో కొన్ని ఇళ్లు ఇప్పటికే దెబ్బతిన్నాయి. పగుళ్లు రావటం, పెచ్చులు ఊడిపడటం, బాల్కనీ రెయిలింగ్ లు విరిగిపడటంతో స్థానికులు భయం భయంగా జీవిస్తున్నారు. అధికారులు స్పందించి మురుగు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి : నవంబర్లో భారత్ బయోటెక్ 'కొవాగ్జిన్' మూడో దశ ట్రయల్స్