ఆరోగ్యశ్రీ, నాన్ ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు సంబంధించి చికిత్స అందిస్తున్న రోగుల వివరాలు పోర్టల్లో పొందుపర్చాలని గుంటూరు జిల్లా కలెక్టరు వివేక్యాదవ్ అన్నారు. పాజిటివ్ వచ్చిన ఫ్రంట్లైన్ వర్కర్స్, హెల్త్ కేర్ వర్కర్లకు ఆసుపత్రుల్లో మొదటి ప్రాధాన్యంగా పడకలు కేటాయిస్తామన్నారు. ఆసుపత్రులకు ఆక్సిజన్ సరఫరాపై ఎప్పటికప్పుడు సమీక్షించుకుని ఆ మేరకు సరఫరా చేపట్టాలని, వృథా కాకుండా సిబ్బంది పర్యవేక్షించేలా సూచనలు చేయాలన్నారు. సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా ప్రాణవాయువును ఎలా సమర్థంగా వాడాలో సంబంధిత సిబ్బందికి శిక్షణ ఇవ్వాలన్నారు. స్వల్ప లక్షణాలున్న రోగికి కూడా అందిస్తున్నారని, ఇందువల్ల అత్యవసరమైన రోగికి ఆక్సిజన్ అందించలేకపోతున్నాన్నారు.
ప్రాణవాయువు అందుబాటులో లేకుండా ఆసుపత్రిలో చేర్చుకుని ప్రాణనష్టం కలిగిస్తే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. ఏడు ఆక్సిజన్ ఫిల్లింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి దుర్వినియోగం కాకుండా పర్యవేక్షించాలన్నారు. అనుమతించని ఆసుపత్రులు, వైద్యులు.. కొవిడ్ రోగులకు చికిత్సలు అందిస్తే కేసులు నమోదు చేసి లైసెన్సులు రద్దు చేస్తామన్నారు. రెమ్డెసివిర్ ఇంజెక్షన్ ఆడిట్ను పారదర్శకంగా చేపట్టాలని సూచించారు. జీజీహెచ్లో అవసరమైన ఆక్సిజన్ పైప్లైన్ ఏర్పాట్లను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని వైద్యారోగ్య శాఖ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శ్రీనివాస్ను ఆదేశించారు. సమీక్షలో జేసీలు ఏఎస్ దినేష్కుమార్, పి.ప్రశాంతి, కె.శ్రీధర్రెడ్డి, శిక్షణ కలెక్టర్ శుభం బన్సాల్, డీఆర్వో పి.కొండయ్య, ఔషధ నియంత్రణ శాఖ సహాయ సంచాలకులు అనిల్కుమార్, డీఎంహెచ్వో యాస్మిన్, జడ్పీ సీఈవో చైతన్య, ఆరోగ్యశ్రీ సమన్వయకర్త జయరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
అనధికార ల్యాబ్లు గుర్తించండి
అనధికారికంగా కొవిడ్ పరీక్షలు నిర్వహించే ల్యాబ్లను గుర్తించాలని కలెక్టర్ వివేక్యాదవ్ పీహెచ్సీ వైద్యులకు సూచించారు. సోమవారం టెలికాన్ఫరెన్స్ ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ హెల్త్ కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లోని వైద్యాధికారులతో ఆయన కొవిడ్ పరీక్షలు, ట్రేసింగ్, డేటా ఎంట్రీ అంశాలపై సమీక్షించారు. కలెక్టరు మాట్లాడుతూ వైద్యాధికారులకు సచివాలయాల్లో పని చేసే ఇంజినీరింగ్ అసిస్టెంట్లను సహాయకులుగా నియమించామన్నారు. వైద్యాధికారిణి బాంధవి మాట్లాడుతూ హోం ఐసొలేషన్లో ఉంటూ కొవిడ్ కేర్ కేంద్రానికి, ఆసుపత్రికి మార్చాలంటే.. వైద్యాధికారుల లాగిన్లో ఆప్షన్ లేదని చెప్పారు. కొవిడ్ సందేహాలుంటే నోడల్ అధికారిని అడిగి తెలుసుకోవాలని జేసీ ప్రశాంతి సూచించారు. నూతక్కి పీహెచ్సీ వైద్యురాలు దుర్గ శైలజ మాట్లాడుతూ హోం ఐసొలేషన్లో ఉన్న వాళ్లు అనధికార పరీక్షలు చేయించుకుని మౌనంగా ఉంటున్నారన్నారు. వారికి ఆక్సిజన్ స్థాయి 70, 80కి పడిపోయినప్పుడు ఫోన్లు చేసి పాజిటివ్ అని చెబుతున్నారన్నారు. పాజిటివ్ కేసులున్న ఇంట్లో.. మిగిలిన సభ్యులు కూడా అనధికారికంగా కొవిడ్ పరీక్షలు చేయించుకుని మౌనంగా ఉంటున్నారన్నారు. దీనిపై కలెక్టరు వివేక్యాదవ్ స్పందిస్తూ అనధికారంగా పరీక్షలు చేయించుకోకుండా పీహెచ్సీ, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లోని వైద్యులు ప్రజలను చైతన్యపర్చాలని సూచించారు. ఎవరైనా అనధికారంగా టెస్టులు చేస్తుంటే.. 1902కు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకొంటామన్నారు. 104కి వచ్చిన ఎమర్జెన్సీ కేసులను వైద్యాధికారికి పంపి వాటిని పరిష్కరించాలన్నారు.
ఇదీ చదవండి: రేపటి నుంచే పగటి కర్ఫ్యూ.. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకే దుకాణాలు