తెలంగాణలోని దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి (57) అంత్యక్రియలు ముగిశాయి. సిద్దిపేట దుబ్బాక మండలం చిట్టాపూర్లో రామలింగారెడ్డికి కుటుంబ సభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు, రామలింగారెడ్డి అంతిమయాత్రలో పాల్గొన్నారు. స్వయంగా పాడే మోశారు. సోలిపేటతో తనుకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అంతిమ యాత్రలో భారీగా పాల్గొన్న అభిమానులు, నాయకులు, కార్యకర్తలు అభిమాన నేతకు తుది నివాళులు అర్పించారు.
టీసీఎం కేసీఆర్ నివాళి..
రామలింగారెడ్డి పార్థివదేహానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. సోలిపేట స్వగ్రామం దుబ్బాక మండలం చిట్టలూర్కు చేరుకున్న కేసీఆర్.. రామలింగారెడ్డి భౌతికకాయంపై పూలు వేసి అంజలి ఘటించారు. విషణ్ణవదనంతో ఉద్యమ సహచరుడికి నివాళులు అర్పించారు. రామలింగారెడ్డి కుటుంబసభ్యులను ఓదార్చారు. టీసీఎం వెంట ఆ రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, పువ్వాడ అజయ్, సత్యవతి రాథోడ్ ఎమ్మెల్యే సోలిపేట భౌతికకాయానికి నివాళులు అర్పించారు.
తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర..
2004, 2008లో తెలంగాణలోని దొమ్మాట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014, 2018లో దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సోలిపేట.. ప్రస్తుతం శాసనసభ అంచనాల కమిటీ ఛైర్మన్గా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. హరీశ్రావు, పద్మాదేవేందర్ రెడ్డితో కలిసి ఉద్యమాల్లో పాల్గొన్నారు. రాజకీయాల్లోకి రాకముందు జర్నలిస్టుగా పనిచేశారు. సోలిపేట రామలింగారెడ్డికి భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.
చికిత్స పొందుతూ మృతి..
అనారోగ్యం కారణంగా 15 రోజుల క్రితం రామలింగారెడ్డి కాలికి శస్త్ర చికిత్స జరిగింది. అది ఇన్ఫెక్షన్ కావడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో ఆయన్ను గచ్చిబౌలిలోని మరో ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే.
ఇవీ చూడండి: ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక నోటిఫికేషన్ జారీ