Buddha Venkanna: నిజమైన అవినీతిపరుల్ని రక్షిస్తూ ఉద్యోగులపై కక్ష సాధించేందుకే సీఎం జగన్.. 'అవినీతి నిర్మూలన' యాప్ను ప్రారంభించారని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అవినీతికి చట్టబద్దత కల్పించిన ముఖ్యమంత్రి జగన్ అవినీతి నిర్మూలనపై యాప్ ప్రారంభించటం హాస్యాస్పదమన్నారు. తీవ్రవాద సంస్థలు ప్రవచనాలు చెప్పినట్లు జగన్రెడ్డి యాప్ విడుదల ఉందని ఎద్దేవా చేశారు. మద్యం, ఇసుక ద్వారానే జగన్రెడ్డి అవినీతి సంపాదన రూ.5వేల కోట్ల రూపాయలన్న బుద్దా వెంకన్న.. ఈ కుంభకోణంపై ఏ యాప్లో ఫిర్యాదు చేయాలో జగన్ రెడ్డే చెప్పాలని నిలదీశారు.
అవినీతికి కేరాఫ్ అడ్రస్గా ఉన్న వ్యక్తి సహచర అవినీతిపరులైన విజయసాయి, నిరంజన్ రెడ్డిలను చట్టసభలకు పంపారని విమర్శించారు. అవినీతిపరులకు పదవులు ఇస్తూ... అవినీతి నిర్మూలన మంత్రులకు వర్తించదన్నట్లుగా జగన్ వ్యవహారం ఉందని దుయ్యబట్టారు. వైకాపా ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీల అవినీతిపై ఫిర్యాదుకు మరో యాప్ పెట్టే దమ్ము ముఖ్యమంత్రికి ఉందా అని బుద్దా వెంకన్న సవాల్ విసిరారు.
ఇవీ చదవండి: