ఆర్నెళ్ల సుదీర్ఘ విరామం అనంతరం ప్రారంభమైన తిరుమల సర్వదర్శన టికెట్లపై.. ఆశతో తిరుపతి వచ్చిన భక్తులకు నిరాశే మిగిలింది. తితిదే చరిత్రలో.. సర్వదర్శనం టికెట్లను తొలిసారి ఆన్లైన్ ద్వారా విడుదల చేయడం వల్ల...తీవ్ర వేదనే దక్కింది. వీరంతా.. శ్రీనివాస వసతి సముదాయంలో సర్వదర్శనం టికెట్లు నేరుగా తీసుకోవాలని వచ్చారు. సర్వదర్శనం టిక్కెట్లను ఆన్లైన్ ద్వారా తితిదే జారీ చేయనుందని ప్రకటించడంతో రెండురోజుల పాటు నిరీక్షించినా ….వారికి నిరాశే ఎదురైంది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు.. సర్వదర్శనం ఆన్లైన్ టికెట్ల కోసం తిరుపతిలో ఇంటర్నెట్ కేంద్రాల వద్ద భక్తులు పడిగాపులు గాచారు. టిక్కెట్లు ఆన్లైన్లో పెట్టిన అరగంటకే ఖాళీ అవ్వడంతో భక్తులు తీవ్ర నిరాశ చెందారు.
పెరటాసి మాసంలో ముప్పై ఏళ్లుగా పెరుమాళ్ దర్శనానికి వస్తున్నా.. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురుకాలేదని.. తమిళనాడు నుంచి వచ్చి ఓ భక్తురాలు వాపోయారు. ఆన్లైన్, ఆఫ్లైన్ అంటూ...తితిదే అధికారులు రోజుకో నిర్ణయం తీసుకుని ఇబ్బందులకు గురిచేశారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక..ఎంతోమంది భక్తుల అవసరాలను ఆసరా చేసుకున్న ఇంటర్నెట్ కేంద్రాల నిర్వాహకులు.. ఉచిత దర్శన టికెట్లను 3 వేల నుంచి 4 వేలకు అమ్ముకున్నారు. తిరుమలకు అనుమతిస్తే.. తలనీలాల మొక్కులు తీర్చుకుని... అఖిలాండం దగ్గర కొబ్బరికాయలు కొట్టయినా తిరిగి వెళ్లిపోతామంటూ.. భక్తులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: RAINS UPDATE: తుపానుగా మారిన తీవ్ర వాయుగుండం..నేడు తీరం దాటే అవకాశం