నూతన జాతీయ విద్యా విధానం ద్వారా 5వ తరగతి వరకూ మాతృభాషలోనే బోధించేలా కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రేతర తెలుగు సమాఖ్య తెలుగు నుడి-బడి జాతీయ చర్చావేదిక తీర్మానించింది. ఈ మేరకు కేంద్రానికి వినతిపత్రాలు అందించాలని నిర్ణయించింది. ఇతర రాష్ట్రాల్లో తెలుగు భాషాభివృద్ధికి రాష్ట్రేతర తెలుగు అకాడమీ ఏర్పాటు చేసేలా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు విజ్ఞాపనలు అందించనుంది.
ఇతర రాష్ట్రాల్లోని తెలుగు ప్రాంతాల్లో నిర్వహిస్తున్న విద్యాలయాల్లో ఉపాధ్యాయులు, పాఠ్యపుస్తకాల కొరత ఉందని, నిర్వహణ సక్రమంగా ఉండేలా వాటి బాధ్యతను రాష్ట్రేతర తెలుగు సమాఖ్య కార్యనిర్వాహక సభ్యులకు అప్పగించాలని పేర్కొంది. ఇటీవల నిర్వహించిన ఈ చర్చావేదిక ‘సమాపనోత్సవం’ ఆదివారం వర్చువల్ విధానంలో జరిగింది. ఇందులో వందకుపైగా తెలుగు సంఘాల ప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొని ప్రసంగించారు. ప్రముఖుల సూచనలు, సలహాల ఆధారంగా వివిధ రాష్ట్రాల్లో తెలుగు భాషాభివృద్ధికి పలు తీర్మానాలు చేసింది. వీటిని రాష్ట్రేతర తెలుగు సమాఖ్య అధ్యక్షుడు రాళ్లపల్లి సుందరావు ప్రవేశపెట్టారు.
* పొరుగు రాష్ట్రాల్లో భాషా అల్ప సంఖ్యాకవర్గ రాయితీల చట్టం అమలుకు జాతీయ, రాష్ట్ర స్థాయిలో ముమ్మరంగా ప్రయత్నాలు జరగాలి
* ఇతర రాష్ట్రాల్లో ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్న తెలుగు విద్యార్థుల అభీష్టం మేరకు రాష్ట్రేతర తెలుగు సంస్థల ద్వారా మాతృభాష నేర్పించాలి.
* ఇతర రాష్ట్రాల్లో ఎంతో మంది తెలుగువారు మాతృభాషను మర్చిపోయి స్థానిక భాషీయులుగా మారారు. వారికి తెలుగును సులభంగా బోధించి, తెలుగు విశ్వవిద్యాలయం ద్వారా ధ్రువీకరణ పత్రం ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలి.
* అంతర్జాలంలో ప్రతి నెలా తెలుగు భాషలో వ్యాసరచన, పద్య పఠనం, కథలు, సాంస్కృతిక పోటీలను నిర్వహించాలి.
అప్పుడే భావితరాలకు అందించగలం
ప్రస్తుత తరుణంలో మాతృభాష, సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ ఆవశ్యకత ఎంతో ఉంది. భాష, సాహిత్యాన్ని కలిసికట్టుగా పరిరక్షించుకుంటేనే వాటిని భావితరాలకు అందించగలుగుతాం. - జస్టిస్ ఎం.రాజశేఖర్, కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి
కలిసికట్టుగా కృషిచేయాలి
మాతృభాష పరిరక్షణకు దేశంలోని తెలుగువారంతా కలిసికట్టుగా కృషి చేయాలి. ప్రభుత్వాలపై ఆధారపడకుండా రాష్ట్రేతర తెలుగు సమాఖ్య కృషి చేస్తోంది. - జస్టిస్ రామలింగేశ్వరరావు, విశ్రాంత న్యాయమూర్తి
ఇదీ చదవండి: 'న్యాయమూర్తులపై పోస్టుల వ్యవహారంలో కుట్ర కోణం ఉందా?'