విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలపై మరోసారి కేంద్రం తన వైఖరిని స్పష్టంచేసింది. పీపీఏలను సమీక్షించాలనుకుంటున్నట్లు ఏపీ ప్రభుత్వం చెప్పిన వెంటనే ఇది వీలుకాదని స్పష్టం చేసినట్లు కేంద్ర పునరుత్పాదక ఇంధనశాఖ తెలిపింది. అనుమానాలకు తావులేకుండా... అవినితీ నిరూపించగలిగితే తప్ప సమీక్ష చేయడానికి వీల్లేదని స్పష్టం చేసినట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. ఏపీతో పాటు కొన్నిరాష్ట్రాలు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల 2022 నాటికి 1.75 లక్షల మెగావాట్ల పునరుత్పాదక విద్యుదుత్పత్తి లక్ష్యాన్ని భారత్ చేరుకోలేదన్న క్రిసెల్ అంచనాలను కేంద్రం తోసిపుచ్చింది. భారత ప్రభుత్వం ఇప్పటి వరకూ 82,580 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న కేంద్రాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందని.. అవన్నీ వివిధ దశాల్లో నిర్మాణమవుతున్నాయని తెలిపింది. 2021 మొదటి త్రైమాసికం కల్లా 65 శాతం.. 2022 నాటికి వంద శాతం లక్ష్యం చేరుకుంటామని కేంద్ర ఇంధన శాఖ వివరించింది. పారదర్శక విధానం, పోటీతత్వం వల్ల సౌర, పవన విద్యుత్ ధరలు భారీగా తగ్గాయని వెల్లడించింది.
ఇదీ చదవండి :