కొవిడ్-19 వైరస్ కేసు రాష్ట్రంలో ఒక్కటి కూడా నమోదు కాలేదని ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ వైరస్ను పూర్తిగా నియంత్రించగలిగామని... వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. కొవిడ్-19 వైరస్ సోకిన దేశాల నుంచి 193 మంది ప్రయాణికులు రాష్ట్రానికి వచ్చారని... వీరిలో 187 మందిని వారి ఇళ్లలోనే ఉంచి వైద్య పరీక్షలు నిర్వహించామని వైద్యారోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి తెలిపారు. చైనా నుంచి వచ్చిన ఐదుగురికి మాత్రం.... 28 రోజుల పర్యవేక్షణ పూర్తైందని వెల్లడించారు. రాష్ట్రంలో పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పారు.
కొవిడ్ 19 వైరస్ విషయంలో రాష్ట్రస్థాయిలో 24 గంటలూ పనిచేసే కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయడంతో పాటు... రాష్ట్ర, జిల్లా స్థాయిలో నోడల్ అధికారులను నియమించామని జవహర్రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో ఐసొలేషన్ వార్డులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయన్నారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు రాష్ట్రానికి చేరుకోగానే... 28 రోజుల పాటు తమ ఇళ్లలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని.... బయటకు రావొద్దని సూచించారు. దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందుల వంటి లక్షణాలుంటే మాస్క్ల కోసం సమీప ప్రభుత్వ ఆస్పత్రులను సంప్రదించాలని సూచించారు.
ఇదీ చదవండి:
కరోనా ఎఫెక్ట్: రాష్ట్రంలో ఆగిన సౌర విద్యుత్తు ప్రాజెక్టుల నిర్మాణం