ఆక్వా రైతులకు, సముద్రంలోకి చేపల వేటకు వెళ్లి తెచ్చుకున్న సరకుకు మంచి ధర వచ్చేందుకు రాష్ట్రంలో 100 ఆక్వా హబ్లు, వాటి ఆధీనంలో 12,000 దుకాణాలు ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి మంగళవారం మత్స్యకార భరోసా నిధులు రూ.119.88 కోట్లను బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలలోకి సీఎం జమ చేశారు. మొత్తం 1,19,875 మంది మత్స్యకారులకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున పంపించారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ...
* రాష్ట్రంలో ఏ ఒక్క ఆక్వా రైతు, మత్స్యకారుడు నష్టపోకూడదనేది ప్రభుత్వ లక్ష్యం. వారికి గిట్టుబాటు ధర కల్పించేందుకు వంద ఆక్వా హబ్లు ఏర్పాటు చేస్తున్నాం. ఒక్కో హబ్ పరిధిలో 120 దుకాణాల చొప్పున 12,000 రీటైల్ షాపులు ఉంటాయి. దీనివల్ల ఆక్వా ఉత్పత్తులకు, మత్స్యకారులు వేటకు వెళ్లి తెచ్చే చేపలకు మంచి గిట్టుబాటు ధర పలుకుతుంది. రెండేళ్లలోనే వీటి ఏర్పాటులో పురోగతి సాధిస్తాం.
* మత్స్యకారుల ఉపాధికి రాష్ట్రంలో 8 ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్నాం. గుంటూరు జిల్లా నిజాంపట్నం, కృష్ణా జిల్లా మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ల ఆధునికీకరణతోపాటు ఉప్పాడ(తూర్పుగోదావరి), జువ్వెలదిన్నె(నెల్లూరు)లలో కొత్తగా నిర్మిస్తున్నాం. వీటి పనులు రూ.1509.80 కోట్ల అంచనా వ్యయంతో మొదలయ్యాయి. రెండో దశలో రూ.1,365.35 కోట్లతో బుడగట్టపాలెం(శ్రీకాకుళం), పూడిమడక(విశాఖ), బియ్యపుతిప్ప(పశ్చిమగోదావరి), కొత్తపట్నం(ప్రకాశం)లలో నాలుగు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపడతాం. టెండర్లు ఖరారు చేసి ఈ ఏడాదే పనులు ప్రారంభిస్తాం. వీటితో 80 వేల మందికి ఉపాధి లభిస్తుంది.
కొవిడ్ కష్టాలున్నా భరోసా కల్పిస్తున్నాం
* కొవిడ్తో ఆర్థిక ఇబ్బందులున్నా మత్స్యకార భరోసా కింద నిధులు జమచేశాం. తొలి ఏడాది లక్ష మంది లబ్ధిదారులు ఉండగా ఈఏడాది 1.20 లక్షలకు పెరిగారు. ఇంతవరకు రూ.332 కోట్లు మత్స్యకార భరోసా కింద చెల్లించాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 23 నెలల కాలంలో అక్కాచెల్లెమ్మలకు, పేదలకు మంచి జరగాలనే ప్రతి కార్యక్రమం చేస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో ఓఎన్జీసీ తవ్వకాలతో 14,927 మత్స్యకార కుటుంబాలు ఉపాధి కోల్పోతే ఆ సంస్థ సాయం చేయకున్నా రూ.75 కోట్లు ప్రభుత్వమే ఇచ్చింది.
* గతంలో చేపల వేట సమయంలో రూ.4వేలు, డీజిల్పై రూ.6 రాయితీ ఇస్తామని చెప్పినా ఏనాడూ సక్రమంగా ఇవ్వలేదు. అదీ 5వేల పడవలకే ఇచ్చేవారు. ప్రస్తుతం 26,823 పడవలకు లీటరు డీజిల్కు రూ.9 సబ్సిడీ ఇస్తున్నాం. వంద పెట్రోలు బంకులను ఇందుకోసం కేటాయించాం. చేపల వేటకు వెళ్లి మత్స్యకారులు చనిపోగా అలాంటి 67 కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున రూ.6.7 కోట్లు అందించాం. ఆక్వా సాగుకు యూనిట్కు రూ.1.50కే సరఫరా చేస్తూ 53,550 మంది రైతులకు ప్రయోజనం కల్పించాం. రెండేళ్లలో రూ.1,560 కోట్ల రాయితీని భరించాం. రాష్ట్రంలో 35 చోట్ల ఆక్వా ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లు రూ.50.30 కోట్ల వ్యయంతో ఏర్పాటుచేశాం. విత్తనం నుంచి మేత వరకు అన్నీ అందిస్తున్నాం. వాటిని రైతు భరోసా కేంద్రాలతో సంధానం చేస్తున్నాం.
* పశ్చిమగోదావరి జిల్లాలో ఏపీ మత్స్య యూనివర్సిటీ పనులను ఈ సంవత్సరంలోనే ప్రారంభిస్తాం.
కొవిడ్ ఉన్నా ఆపలేదు
కొవిడ్ సంక్షోభ సమయంలోనూ ఏ ఒక్క పథకాన్ని ఆపకుండా ముఖ్యమంత్రి దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నారని పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. కార్యక్రమంలో ఎంపీ మోపిదేవి వెంకటరమణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, మత్స్యశాఖ కమిషనర్ కన్నబాబు, ప్రభుత్వ సలహాదారు అంబటి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నాడు రూ. 5 లక్షలే...ఇప్పుడు రూ.10 లక్షలు
వేటకు వెళ్లి ప్రమాదవశాత్తూ చనిపోతే సాయం రూ.10 లక్షలకు పెంచడం సంతోషమని నిజాంపట్నం మత్స్యకారుడు కె.వెంకటేశ్వరరావు అన్నారు. మత్స్యకార భరోసాతో లబ్ధిపొందిన మత్స్యకారులు కొందరు సమావేశంలో మాట్లాడారు. కరోనాతో చచ్చిపోతామో, కరవుతో చనిపోతామో అనుకునే రోజుల్లో ప్రభుత్వం ఇచ్చే రూ.10 వేలు తమను ఆదుకుంటున్నాయని కృష్ణా జిల్లా గిలకలదిన్నెకు చెందిన చింతా గోవిందరాజులు చెప్పారు. భరోసా సొమ్ములు, మత్స్యకారులు ఎవరైనా చనిపోతే ఇచ్చే సాయం నేరుగా వారి ఖాతాలకే జమ చేస్తున్నారని, కాళ్లరిగేలా తిరగాల్సిన పని లేదని తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం మత్స్యకారుడు బర్రె లక్ష్మీ నరసింహరాజు అన్నారు.
ఇదీ చదవండి:
రఘురామకు వైద్య పరీక్షలు ప్రారంభం.. ప్రత్యేక మెడికల్ బోర్డు పర్యవేక్షణ