వైకాపా సర్కార్ జీవో 81ను విడుదల చేయటంపై నారా లోకేశ్ మండిపడ్డారు. ప్రభుత్వ తొందరపాటు చర్యల వలన తల్లిదండ్రులు, పిల్లలు ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. ఈ నిర్ణయాన్ని ఓసారి సమీక్షించుకోవాలని ప్రభుత్వానికి హితవు పలికారు. హడావుడిగా ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే రద్దు చెయ్యాలని డిమాండ్ చేశారు. తెదేపా ప్రభుత్వ హయాంలో నగరపాలక పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని చూస్తే వైకాపా నాయకులు తీవ్ర విమర్శలు చేశారని గుర్తుచేశారు. ముందస్తు ప్రణాళిక లేకుండా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధనలు ప్రవేశపెట్టడం జగన్ గారి మరో అనాలోచిత నిర్ణయమని ఎద్దేవా చేశారు.
కోట్లలో కోత దేనికి సంకేతం
వైకాపా బాధితులకు వైకాపా న్యాయం చేయడం కలే అని నారా లోకేశ్ విమర్శించారు. అగ్రిగోల్డ్ కుంభకోణం జరిగింది మహామేత హయాంలోనే అన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులు కొట్టేయడానికి వైకాపా నేతలు గతంలో కేసులు వేసి ఆస్తుల కొనుగోలుకు ముందుకొచ్చిన కంపెనీలను బెదిరించారని ఆరోపించారు. బాధితులకు రూ.1,150 కోట్ల మొత్తాన్ని చెల్లిస్తామని మడమ తిప్పటం వెనుక రహస్యం ఏంటని ప్రశ్నించారు. తెదేపా హయాంలో బాధితులకు కేటాయించిన రూ.363 కోట్లలో ఇప్పుడు కోత దేనికి సంకేతమని నిలదీశారు. అగ్రిగోల్డ్ స్కామ్ సూత్రధారులతో జె-ట్యాక్స్ కోసం జరుగుతున్న చర్చలు కొలిక్కి వచ్చేవరకూ బాధితులకు వైకాపా న్యాయం చేయదని ట్వీట్ చేశారు.