తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగిరి, ముత్తారం మండలాల్లో నకిలీ పాసుపుస్తకాలను సృష్టించి బ్యాంక్ రుణాలు ఇప్పించిన 12మంది ముఠా సభ్యులను రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ అరెస్ట్ చేశారు. వారి నుంచి 5లక్షల 55 వేల నగదు, నకిలీ పాసుపుస్తకాలు, రబ్బరు స్టాంపులతో పాటు పహాని పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. సీపీ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. 2016-18 సంవత్సరాల మధ్య 153 మంది రైతులు పట్టాదారు పాసు పుస్తకాలతో తెలంగాణ గ్రామీణ బ్యాంక్లో కోటి 99లక్షల 89 వేల రూపాయల రుణం తీసుకున్నారు. సంవత్సర కాలం గడిచిన రుణాలు చెల్లించకపోవడంతో అనుమానం వచ్చిన బ్యాంక్ మేనేజర్ రికార్డులను పరిశీలించగా నకిలీ పాసు పుస్తకాలని తేలింది.
153 మంది రైతులపై రామగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీపీ సత్యనారాయణ ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన పోలీసులు అసలు సూత్రధారి అయిన పందుల ప్రభాకర్తో పాటు మరో 11 మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వీరితో పాటు మరో ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నారని.. అందులో ఇద్దరు బ్యాంక్ మేనేజర్లు, ఒక వీఆర్వో ఉన్నారని, త్వరలో వారిని కూడా అరెస్ట్ చేస్తామన్నారు. రుణాలు తీసుకున్న రైతులను బాధితులుగా, సాక్షులుగా పరిగణించి కేసు విచారణ చేపట్టామన్నారు. నకిలీ పాసు పుస్తకాలు ఎక్కడి నుంచి తెచ్చారు, దీనికి ఎవరెవరు సహకరించారు?.. అనే కోణంలో ఆరా తీస్తున్నామని సీపీ సత్యనారాయణ తెలిపారు.
ఇదీ చదవండి: సీఐడీ విచారణకు హాజరైన సీఆర్డీఏ మాజీ కమిషనర్ చెరుకూరి శ్రీధర్