తెలంగాణ రాష్ట్ర మాజీ ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ నియోజకవర్గం(Huzurabad By Election 2021)లో ఉపఎన్నిక వచ్చింది. ఆయన భాజపా తీర్థం పుచ్చుకున్నప్పటి నుంచి నియోజకవర్గంలో రాజకీయం రంజుగా మారింది. ఇటు అధికార తెరాస, అటు భాజపా నేత ప్రచారాల(Huzurabad By Election Campaign 2021)తో హోరెత్తుతోంది. ఇప్పటికే తెరాస మంత్రి హరీశ్ రావు నియోజకవర్గంలోనే ఉండి.. అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉంటున్నారు. రోజుకో వర్గానికి సంబంధించి ఆత్మీయ, సమ్మేళన సభలు ఏర్పాటు చేస్తూ ప్రజల్లో తెరాసపై పాజిటివ్ టాక్ తీసుకొస్తున్నారు.
మరోవైపు.. మాజీ మంత్రి ఈటల.. తెరాసపై విమర్శ బాణాలు ఎక్కు పెడుతూ ప్రచారం(Huzurabad By Election Campaign 2021)లో జోరు సాగిస్తున్నారు. ఆయనతో పాటు సతీమణి జమున కూడా ప్రచారాల్లో హోరెత్తిస్తున్నారు. అధికార గులాబీదళంపై ఎప్పటికప్పుడు విమర్శలు గుప్పిస్తూ.. తన భర్త నియోజకవర్గానికి చేసిన సేవలు గుర్తు చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇంకోవైపు ఈటల.. తెరాస ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇప్పటికే ప్రచార జోరు(Huzurabad By Election Campaign 2021) ఊపందుకున్న ఈ నియోజకవర్గంలో.. ఉపఎన్నికకు ఇంకా నెలరోజులే సమయం ఉండటం వల్ల ఆ జోరు మరింత పెరగనుంది. విమర్శలు, ప్రతివిమర్శలనే అస్త్రశస్త్రాలుగా చేసుకుని అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రజల్లోకి వెళ్లనున్నారు. తెరాస సర్కార్ ప్రవేశపెట్టిన దళితబంధును ప్రజల్లోకి తీసుకెళ్లి.. ఓట్లు కూడగట్టుకునే పనిలో తెరాస ఉండగా.. దళిత బంధు ఒక్కటే కాదు.. బీసీ, గిరిజన, ఓసీ బంధులు కూడా కావాలంటూ భాజపా, కాంగ్రెస్లు తెరాసపై విమర్శలు, ఆరోపణలు చేస్తూ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. రానున్న నెలరోజుల్లో హుజూరాబాద్ నియోజకవర్గం ఓ రాజకీయ రణరంగంలా మారనుంది.
- అక్టోబర్ 1న ఉపఎన్నిక నోటిఫికేషన్
- అక్టోబర్ 8 వరకు నామినేషన్ల స్వీకరణ
- 11న అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన
- 13 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు
- అక్టోబర్ 30న పోలింగ్
- నవంబర్ 2న ఓట్ల లెక్కింపు