విశాఖ, గుంటూరు జిల్లాల్లోని ఘనంగా వినాయక పూజలు నిర్వహించారు. కొవిడ్ నిబంధనలు అనుసరించి కార్యాలయాల్లో పది మంది కన్నా తక్కువగా ఉండి విఘ్నాలు లేకుండా కార్యక్రమాన్ని జరిపారు.
విశాఖ జిల్లాలో...

విశాఖ చినముషిడివాడ శారదా పీఠంలో వినాయక పూజలు, అభిషేకాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామివారి కథా పారాయణం చేశారు. ప్రతి ఏటా గణనాథుడి చవితి వేడకులు ఘనంగా నిర్వహిస్తామని పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి తెలిపారు.
గుంటూరు జిల్లాలో...

తాడేపల్లి వైకాపా కేంద్ర కార్యాలయంలో మట్టితో చేసిన గణపతిని ప్రతిష్ఠించి... అనంతరం పూజలు నిర్వహించారు. పార్టీ అధికార ప్రతినిధి లేళ్ల అప్పిరెడ్డి ఇతర నాయకులు గణనాథునికి ఫలపుష్పాలు సమర్పించారు. కొవిడ్ నిబంధనలు అనుసరించి పది మందిలోపు హాజరైనట్టు కార్యాలయ ప్రతినిధులు తెలిపారు.

మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి పూజలు ఘనంగా నిర్వహించారు. మట్టి వినాయకుని ప్రతిష్ఠించి పూజలు చేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు.

ఓ బొజ్జ గణపయ్య... అమరావతే రాజధానయ్య అంటూ ఎమ్మెల్సీ రామకృష్ణ గుంటూరులో పూజలు నిర్వహించారు. అమరావతి నుంచి రాజధాని తరలిపోకుండా ఆ లంబోదరుడే అడ్డుకుంటారని ఆయన ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు పాల్గొన్నారు.

గుంటూరు వాసవి కన్యకా పరమేశ్వర ఆలయంలో జరిపిన గణనాథుని వేడుకల్లో ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ పాల్గొన్నారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యేతో పూజలు చేయించారు. రాష్ట్ర ప్రజలకు విఘ్నాలు తొలగిపోయి విజయాలు చేకూరాలని గణేశున్ని ప్రార్ధించినట్లు ఆయన తెలిపారు.
ఇదీ చదవండి: