ఉమ్మడి ఏపీ మాజీ సీఎస్.. ఎస్వీ ప్రసాద్ కన్నుమూశారు. కొద్దిరోజుల కిందట కరోనా బారిన పడిన ఆయన యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఐఐఎం అహ్మదాబాద్లో ఎంబీఏ పూర్తిచేసిన ఆయన.. 1975 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన అధికారి.
నెల్లూరు జిల్లా సబ్కలెక్టర్గా ఎస్వీ ప్రసాద్ తన కెరీర్ను ప్రారంభించారు. అనంతరం 1982లో కడప, 1985లో విశాఖపట్నం జిల్లాల కలెక్టర్గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత పలు ప్రభుత్వ శాఖలు, విభాగాలకు ఛైర్మన్, కార్యదర్శి, ముఖ్య కార్యదర్శి స్థాయి నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి వరకు ఎదిగారు. 2010లో రోశయ్య సీఎంగా ఉన్నప్పుడు సీఎస్గా పనిచేశారు. తన కంటే 20 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులున్నా ఎస్వీ ప్రసాద్నే సీఎస్ పోస్టు వరించింది. పదేళ్లకు పైగా ముగ్గురు ముఖ్యమంత్రుల వద్ద ఎస్వీ ప్రసాద్ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వహించారు. నేదురుమల్లి జనార్దన్రెడ్డి, కోట్ల విజయభాస్కర్రెడ్డి, చంద్రబాబు హయాంలో ముఖ్యకార్యదర్శిగా పనిచేశారు.
గవర్నర్ భిశ్వభూషన్ హరిచందన్ , చంద్రబాబు విచారం
మాజీ సీఎస్ ఎస్వీ ప్రసాద్ మృతిపట్ల తెదేపా అధినేత చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అందరినీ ముందుండి నడిపే అధికారిగా చెరగని ముద్ర వేసుకున్నారన్న చంద్రబాబు.. అంకితభావంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించారని కొనియాడారు.
ఎస్.వి.ప్రసాద్ మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరి చందన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రసాద్ అకాల మరణం తెలుగు ప్రజలకు తీరని లోటని అన్నారు. సగటు ప్రజలకు సైతం అందుబాటులో ఉంటూ అంకిత భావంతో విధులు నిర్వహించిన అధికారిగా అందరి మన్ననలు అందుకున్నారని కొనియాడారు. ఆయన కుటుంబసభ్యులకు హరిచందన్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఇదీ చదవండి: