దేశంలో మరో మారు కరోనా వ్యాప్తి చెందుతోంది. తెలంగాణ రాష్ట్రంలోని విద్యాసంస్థల్లోనూ చెదురుమదురుగా కేసులు నమోదవుతున్నాయి. విద్యా సంస్థలను తాత్కాలికంగా మూసివేయాలని తల్లి దండ్రుల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. ఈ పరిస్థితులను సమీక్షించి ముందుజాగ్రత్త చర్యగా.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలన్నిటినీ ఈనెల 24 నుంచి తాత్కాలికంగా మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పదో తరగతి వరకు పాఠశాలలను మూసివేయాలని వైద్య, ఆరోగ్యశాఖ నివేదించినా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒక్క మెడికల్ కళాశాలలు తప్ప మిగిలిన అన్ని విద్యాసంస్థ లను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఓయూ హాస్టళ్లలోనూ కేసులు నమోదు కావడంతో సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. అయితే 9, 10 తరగతుల విద్యార్థులకు పరీక్షలు సమీపంలోనే ఉన్నందున.. వారిని మినహాయించాలని పీఆర్టీయూ కోరింది. ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తమకు తరగతులు నడిపేందుకు అవకాశం ఇవ్వాలని యాజమాన్య సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి.
పరీక్షలు జరుగుతాయా.. లేదా?
ఇంటర్ పరీక్షలు మే 1 నుంచి 19 వరకు, పదో తరగతి పరీక్షలు మే 17 నుంచి 26 వరకు జరుగుతాయని ప్రభుత్వం నెల క్రితమే ప్రకటించింది. ఇప్పుడు మళ్లీ విద్యాసంస్థలను మూసివేస్తుండటంతో వార్షిక పరీక్షలు జరుగుతాయా.. లేదా? అనే సందిగ్ధం నెలకొంది. ప్రభుత్వ ఆదేశాల మేరకే నిర్ణయం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇంటర్ విద్యార్థులకు ఏప్రిల్ 1 నుంచి ప్రయోగ పరీక్షలు మాత్రం జరిగే పరిస్థితి లేదన్నారు. జేఈఈ వంటి జాతీయస్థాయి పరీక్షలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. జేఎన్టీయూలో జరుగుతున్న యూజీ, పీజీ పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని రిజిస్ట్రార్ హుస్సేన్ ప్రకటించారు. కొవిడ్ సోకిన విద్యార్థులకు ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించి..రెగ్యులర్గానే పరిగణిస్తామని తెలిపారు. ఉస్మానియాలోనూ పరీక్షలు యథావిధిగా జరుగుతాయని తెలిపారు.
ఉపాధ్యాయులు రావాలా? వద్దా?
ఉపాధ్యాయులు అధ్యాపకులు విధులకు ప్రత్యక్షంగా హాజరు కావాలో.. లేదో ప్రభుత్వం స్పష్టంచేయకపోవడంతో వారిలో అయోమయం నెలకొంది. అయితే స్పష్టమైన ఉత్తర్వులు వచ్చే వరకూ ఉపాధ్యాయులు ప్రత్యక్షంగా హాజరు కావాల్సిందేనని అధికారులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: