తెలంగాణలోని భద్రాద్రి జిల్లా పరిశ్రమలకు నెలవు. కేటీపీఎస్, సింగరేణి, రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తామని కొందరు మోసగాళ్లు నమ్మబలకడంతో ఇటీవల కాలంలో పలు ప్రాంతాలకు చెందిన నిరుద్యోగులు ఒక్కొక్కరూ రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు చెల్లించారు. కొన్నాళ్లకు మోసపోయామని గుర్తించి పోలీసులను ఆశ్రయించారు. ఉద్యోగం ఏదైనా విద్యార్హతలు, ప్రతిభ, నైపుణ్యాల ఆధారంగానే లభిస్తాయని నిరుద్యోగ యువత గుర్తెరగాలి. ‘ఎంపిక కమిటీల్లో మావాళ్లు ఉన్నారనే’ చెప్పే కట్టు కథలు.. తల్లిదండ్రులు కష్టపడి కూడబెట్టిన సొమ్మును కోల్పోయేలా చేస్తాయి.
మీ ఆశే.. వారికి అవకాశం
ఎలాంటి ఆన్లైన్ పోటీల్లో పాల్గొనలేదు. ఎక్కడా దరఖాస్తు చేయలేదు. అయినా ‘మీరు రూ.లక్షలు, రూ.కోట్లు గెలుచుకున్నారని’ చరవాణులకు సందేశాలొస్తున్నాయి. వాటిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్ధు నమ్మారో.. అంతే సంగతులు? కొత్తగూడెంకు చెందిన ఓ యువకునికి ‘అమెరికాలో ఉద్యోగం’ వచ్చిందని ఓ ఈ-మెయిల్ వచ్చింది. అది నమ్మి రూ.10 లక్షల వరకు ఫీజుల పేరుతో చెల్లించాడు. ఖమ్మం జిల్లాలోనూ ఓ వ్యాపారికి లాటరీలో కారు తగిలిందని నమ్మించి రూ.లక్షలు దండుకున్నారు. ఇలాంటి సందేశాలతో అప్రమత్తమై, ఏదైనా ఇబ్బంది కలిగితే వెంటనే స్థానిక పోలీసులను ఆశ్రయించడం మేలు.
ఏటీఎం మోసాలు
రైతులు, డ్వాక్రా మహిళలు, పింఛనుదారులు, చిరువ్యాపారులు, విశ్రాంత ఉద్యోగులు.. ఎవరైనా సరే తమ నగదు విత్ డ్రాకు ఏటీఎంల పైనే ఆధారపడుతున్నారు. ఇదే కేటుగాళ్లకు అవకాశంగా మారింది. పాల్వంచకు చెందిన ఓ విశ్రాంత ఉద్యోగి స్థానిక ఏటీఎంకు పింఛను డబ్బుల కోసం వెళ్లగా.. అక్కడే ఉన్న ఓ మోసగాడు అతని కార్డును మార్చి రూ.50 వేల నగదు తస్కరించాడు. బాధితుడు చేసిన తప్పల్లా ‘వ్యక్తిగత పిన్’ నంబరును నమ్మి చెప్పడమే. ఇలాంటి ఉదంతాలతో పాటు కాల పరిమితి ముగిసిన డెబిట్, క్రెడిట్ కార్డుల బదులు కొత్తవి పంపుతామని ఈ మధ్య ఫేక్ కాల్స్ బాగా వస్తున్నాయని పోలీసుల పరిశీలనలో తేలింది. వ్యక్తిగత వివరాలు చెబితే మోసపోవడం పక్కా.
పక్కదారి పడితే ‘పొదుపు’ సొమ్ము ఖాళీ
కష్టపడి కూడబెట్టే పొదుపు సొమ్మును మదుపు చేసే విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ‘తక్కువ చెల్లిస్తే ఎక్కువ నగదు మీ సొంతం’ అంటూ గొలుసు కట్టు విధానంలో బాధితులను, వారి బంధుమిత్రులను సైతం బోల్తా కొట్టిస్తున్న నకిలీ సూక్ష్మ రుణ సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఇటీవల ఓ రకం కాయలను చూర్ణం చేస్తే రూ.వేలు ముట్టచెబుతామని, తమ ఉత్పత్తులను విక్రయిస్తే అధిక కమీషన్లు ఇస్తామని ఉభయ జిల్లాల వాసుల డిపాజిట్లు గల్లంతు చేసిన ముఠా గుట్టును పోలీసులు రట్టుచేశారు. నమ్మకమైన సంస్థల్లో మదుపు నగదుకు, భవిష్యత్తుకు భరోసాగా ఉంటుందన్నది ఆర్థిక రంగం నిపుణుల మాట.
‘‘ ఇటీవల ప్రలోభాలకు గురిచేస్తున్న సైబర్, ఆన్లైన్ మోసాలు ఎక్కువయ్యాయి. ఫిర్యాదులపై కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నాం. పౌరులు కూడా ఏది పడితే అది నమ్మొద్ధు అవగాహన పెంపొందించుకోవాలి. ఈ దిశగా సదస్సులు సైతం నిర్వహిస్తున్నాం. గోప్యతకు సంబంధించిన వివరాలు ఎవరు అడిగినా చెప్పొద్ధు అనుమానం ఉంటే వెంటనే డయల్-100, లేదా స్థానిక పోలీసులను సంప్రదించండి’’
- కేఆర్కే ప్రసాద్రావు, డీఎస్పీ పాల్వంచ
డిస్కౌంట్ పేరుతో మస్కా
కేవలం 5 నుంచి 10 శాతం ధరకే వస్తువును ఇస్తామనడంతో నమ్మి మోసపోతున్న బాధితుల సంఖ్య ఉభయ జిల్లాలో ఎక్కువైంది. మోసపోతున్నది తక్కువ మొత్తం కావడంతో బయటకొచ్చే ఉదంతాలు అతి తక్కువ. ఖమ్మానికి చెందిన ఓ వ్యక్తి బేసిక్ మోడల్ ఫోన్ రూ.1,850కే వస్తుందని నమ్మి డబ్బు చెల్లించాడు. వారమైనా స్పందన లేక ఆరా తీయగా చివరకు నకిలీ యాప్ అని తేలింది. మరో యాప్లోనూ ఇలాగే రూ.20 వేలకు పైగా విలువైన ఫోన్ను కేవలం రూ.2 నుంచి రూ.3 వేలకే ఇస్తామంటూ అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. లావాదేవీ ఏదైనా నమ్మకమైన ఆన్లైన్ వేదికలోనే జరగాలి. అతి డిస్కౌంట్కు ఆశపడితే అసలుకే ఎసరొస్తుంది.