ప్రకృతిలోని ప్రతి జీవితో మనిషి అనుబంధాన్ని కలిగి ఉంటాడు. అందులో పశువులతో మానవునికి ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది. భారతీయ సంప్రదాయాల్లో వీటికి స్థానం ఒకింత ఎక్కువగానే చెప్పాలి. ఆవులు కూడా తమతో సమానమని భావించిన తెలంగాణలోని వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండకు చెందిన దంపతులు.. ఆవు కూడా తమ బిడ్డ లాంటిదని భావించి దానికి సీమంతం చేశారు. ఆడపిల్లకు ఎలా అయితే సీమంతం చేస్తారో అదే విధంగా గో మాతకు కూడా వైభవంగా సీమంతం చేసి ఆ దంపతులు కూతురు లేని లోటును తీర్చుకున్నారు.
అంగరంగ వైభవంగా...
హన్మకొండలోని ఎస్బీహెచ్ కాలనీకి చెందిన పాశికంటి వీరేశం, శోభకు నలుగురు కూమారులు. వారికి కూతురు లేదు. అందుకే వారు ఒక గోవును పెంచుకుంటున్నారు. తమ కన్న కూతురిలాగా చూసుకున్నారు. గోమాతకు లక్ష్మిగా నామకారణం చేశారు. ఇంతలో గోమాత గర్భవతి కావటంతో ఆడపిల్లకు మాదిరిగా సీమంతం చేయాలని భావించారు. ధరణీ సాయి సేవా సంఘం ఆధ్వర్యంలో లక్ష్మకి ఆ దంపతులు ఘనంగా వేడుక నిర్వహించారు. పూలు, పండ్లు, ఫలహారాలు, చీరెలు, గాజులు, పురోహితుడి చేత వేడుకను వైభవంగా చేశారు. కూతురు లేకపోయినా ఆ ముచ్చటను ఆవు ద్వారా నెరవేర్చుకున్నందుకు ఆ దంపతులు సంతోషంతో ఉద్వేగానికి లోనయ్యారు.
ధరణి సంఘం హర్షం
గోమాత సీమంతానికి చుట్టు పక్కల ఉన్న మహిళలు వచ్చి పాల్గొన్నారు. ఇది చాలా హర్షించదగిన కార్యమని ధరణి సంఘం నిర్వాహకులు తెలిపారు. ఆవు చాలా పవిత్రమైనదని.. హిందూ సంప్రదాయంలో గోమాతను మాతృమూర్తితో సమానంగా పూజిస్తారని అన్నారు. పురాణాల్లో ఆవుకు ప్రత్యేక స్థానం ఉందని.. వాటిని రక్షించిన వారికి మంచి ఫలితాలు కలుగుతాయని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఆలయాలపై దాడులకు నిరసనగా ఫిబ్రవరిలో యాత్ర: సోము వీర్రాజు