విద్యుత్ విక్రయించే సంస్థలకు అనుకూల విధానం ఉండాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. విద్యుత్ రంగంపై అధికారులతో సమీక్షించిన సీఎం.. ఇక్కడ ప్లాంట్లు పెట్టేవారికి సానుకూల వాతావరణం కల్పించేలా చూడాలని అధికారులకు సూచించారు. లీజు ప్రాతిపదికన పరిశ్రమలకు భూములిచ్చే ప్రతిపాదనపై సమావేశంలో చర్చించారు. దీనివల్ల భూములిచ్చేవారికి మేలు జరుగుతుందని జగన్ అభిప్రాయపడ్డారు. ఏటా రైతులకు ఆదాయం వస్తుంది.. భూమిపై హక్కులు వారికే ఉంటాయని తెలిపారు.
మరో వెయ్యి మెగావాట్ల విద్యుదుత్పత్తికి ఎన్టీపీసీ ముందుకొస్తుందని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. 10 వేల మెగావాట్ల సోలార్ ప్లాంట్ నిర్మాణం విధివిధానాలపై సమావేశంలో చర్చ జరిగింది. వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ కోసం ఫీడర్లు ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. వచ్చే రెండేళ్లలో ఫీడర్ల ఆటోమేషన్ పూర్తి చేయాలని సూచించారు.