క్లీన్ ఆంధ్రప్రదేశ్, జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు, విశాఖలో ప్రాధాన్యతా ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్షించారు. రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఎప్పటికప్పుడు చెత్త సేకరణకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరణ చేయాలని.. ప్రతి వార్డుకు 2 చొప్పున, రాష్ట్ర వ్యాప్తంగా 8వేల ఆటోమేటిక్ ట్రక్కులు కొనుగోలు చేయాలని ఆదేశించారు. జులై 8న వాహనాలను ప్రారంభించాలని సీఎం సూచించారు. చెత్తను సేకరించే ప్రతి ట్రక్కుకు జీపీఎస్, కెమెరాల ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి వీధి చివర డస్ట్ బిన్ ఏర్పాటు చేయడం సహా సేకరించిన తడి, పొడి చెత్తను ప్రాసెసింగ్ చేసేలా ఏర్పాట్లు చేయాలని దిశానిర్దేశం చేశారు. వ్యర్థ జలాల శుద్ధికోసం ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలన్నారు.
శరవేగంగా ప్రారంభించాలి..
విశాఖపట్నంలో ప్రాధాన్యతా ప్రాజెక్టులపై సీఎం సమీక్షించారు. భోగాపురం ఎయిర్పోర్టు, బీచ్ కారిడార్ ప్రాజెక్ట్, పోలవరం నుంచి గోదావరి జలాలను పైపులైన్ ద్వారా విశాఖకు తరలింపు పనులను శరవేగంగా ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నాలుగు వారాల తర్వాత మరోసారి సమీక్షించాలని నిర్ణయించారు. విశాఖపట్నం నుంచి భీమిలి వరకూ ఇప్పుడున్న బీచ్ రోడ్డు విస్తరణ సహా భీమిలి నుంచి భోగాపురం వరకూ బీచ్ రోడ్డు నిర్మాణంపై సమావేశంలో చర్చించారు. రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ పూర్తిచేయాలని సీఎం సూచించారు. భూసేకరణతో కలుపుకొని భీమిలి నుంచి భోగాపురం వరకూ రోడ్డు నిర్మాణానికి దాదాపు 1,167 కోట్లు ఖర్చు అవుతుందని ప్రాథమిక అంచనా వేసినట్టు అధికారులు తెలిపారు. పోలవరం నుంచి గోదావరి జలాలను విశాఖ నగరానికి తరలింపు సహా ,పైపులైన్ద్వారా నీటిని తరలించడంపైనా సీఎం సమీక్షించారు. రానున్న 30 ఏళ్ల కాలానికి విశాఖ నగరానికి నీటి అవసరాలను తీర్చేలా ప్రణాళిక రూపొందించాలన్నారు.
నగరానికి ఆభరణంలా ఉండాలి..
విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్ట్పై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. విశాఖ స్టీల్ప్లాంట్ గేట్ నుంచి భోగాపురం వరకూ మెట్రో ప్రతిపాదించారు. మొత్తంగా 76.9 కిలోమీటర్ల మేర నిర్మాణానికి డీపీఆర్ సిద్ధం చేశారు. 53 స్టేషన్లు ఉండేలా ప్రతిపాదనలు తయారు చేశారు. దీంతో పాటు 60.2 కి.మీ. మేర ట్రాం కారిడార్ మెట్రో, ట్రాం కలిపి 137.1 కి.మీ. కారిడార్ ఉంటుందని తెలిపారు. కేవలం మెట్రో నిర్మాణానికి దాదాపు 14వేల కోట్లకుపైగా ఖర్చు అవుతుందని ప్రాథమిక అంచనా వేసినట్లు తెలిపారు. ట్రాం సర్వీసులకు మరో 6వేల కోట్లకుపైగా ఖర్చు అవుతుందన్నారు. ట్రాం, మెట్రోల ఏర్పాటుకు మొత్తంగా 20 వేల కోట్లకు పైగా ఖర్చు అవుతుందని అంచనా వేశారు. మెట్రో, ట్రాం నిర్మాణ శైలిలో మంచి డిజైన్లు పాటించాలన్న సీఎం.. నగరానికి అందం తీసుకొచ్చేలా ఉండాలని, నగరానికి ఆభరణంలా ఉండాలని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: