భీమిలి నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు కొత్తగా గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మాణానికి కేంద్రం అంగీకారం తెలిపింది. ఇప్పటికే విశాఖ బీచ్రోడ్ నుంచి భీమిలి వరకు రహదారి ఉంది.. దీన్ని మరింత అభివృద్ధి చేయడంతోపాటు, భీమిలి నుంచి కొత్త మార్గాన్ని నిర్మించనుంది. దాదాపుగా సముద్ర తీరం పక్క నుంచి.. ఎక్కువ భాగం వంతెనపై ప్రయాణం సాగేలా ఈ మార్గం ఉండనుంది.
విశాఖ పోర్టు నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కలిపే ఈ రహదారి ప్రతిపాదనకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్గడ్కరీ అంగీకారం తెలిపారు. ఇటీవల రాష్ట్ర ఆర్అండ్బీ మంత్రి శంకరనారాయణ, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు తదితరులు పలు ప్రతిపాదనలతో దిల్లీలో గడ్కరీని కలిశారు. ఈ సందర్భంగా దాదాపు అన్ని ప్రతిపాదనలకు ఆమోదం తెలిపి, వాటి నిర్మాణానికి చర్యలు చేపడతామని చెప్పినట్లు ఆర్అండ్బీ ఇంజినీర్లు తెలిపారు.
* విజయవాడకు తూర్పువైపు నిర్మించ తలపెట్టిన మరో బైపాస్కు సంబంధించి.. ఏలూరు వైపు గన్నవరం అవతల పొట్టిపాడు నుంచి కృష్ణానది మీదుగా గుంటూరు జిల్లాలోని కాజా వరకు నాలుగు వరుసలతో నిర్మించేందుకు అంగీకరించి, దీని భూసేకరణకు అయ్యే వ్యయాన్ని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్హెచ్ఏఐ) భరించేందుకు అంగీకరించారు. అయితే ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి వినియోగించే ఇసుక, మట్టి, కంకర తదితర ఖనిజాలపై సీనరేజ్ ఫీజు.. సిమెంట్, స్టీల్ తదితరాలపై రాష్ట్ర జీఎస్టీ మినహాయింపునకు రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకారం తెలిపింది.
* కర్ణాటకలోని చిత్రదుర్గ నుంచి చెళ్లకెరె, పావగడ మీదగా అనంతపురం జిల్లాలోని పెనుకొండ వరకు జాతీయ రహదారికి ఆమోదం తెలపడంతోపాటు, దీనిని పెనుకొండ నుంచి పుట్టపర్తి వరకు పొడిగింపు ప్రతిపాదనకు సమ్మతించారు.
* రాష్ట్రంలో పలు జాతీయ, రాష్ట్ర రహదారుల్లో రైల్వే క్రాసింగ్లు ఉండగా, వీటిపై నిర్మించే వంతెనల(ఆర్వోబీలు)కు రాష్ట్ర వాటా బదులు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ నిధులు వెచ్చించేందుకు అంగీకారం తెలిపారు.
* విజయవాడ-బెంగళూరు మధ్య గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే నిర్మాణానికి ప్రతిపాదన ఇవ్వగా.. దీనిపై నాలుగైదు మార్గాలపై డీపీఆర్లు సిద్ధం చేయించి, తుది మార్గాన్ని ఖరారు చేస్తామని కేంద్ర మంత్రి స్పష్టత ఇచ్చారు.
* నాగార్జునసాగర్ నుంచి దాచేపల్లి, నర్సరావుపేట మీదుగా చిలకలూరిపేట వరకు ఉన్న రాష్ట్ర రహదారిని, జాతీయ రహదారిగా మార్చేందుకు అంగీకారం తెలిపారు.
ఇదీ చదవండి: ఆ రాష్ట్రాల్లో 'కొత్త' వైరస్ అనుమానిత కేసులు