నవంబర్ నుంచి నాడు నేడు
రాష్ట్రంలోని పాఠశాలల రూపు రేఖలు మార్చేందుకు చేపడుతున్న ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ఇంజనీర్ల బాధ్యతలు కీలకమని, నాడు - నేడు కోసం ప్రణాళికతో నిర్దిష్ట సమయంలో పనులు పూర్తి చేయాలని రాష్ట్ర ఆదిమూలపు సురేష్ అన్నారు. ‘మన బడి నాడు-నేడు’ పై సిబ్బందికి పునశ్చరణ కార్యక్రమం తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి సురేష్ ఇంజనీర్లు, విద్యాశాఖ అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యాశాఖ పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో ఉన్నారని, విద్యాశాఖపై జగనన్న ముద్ర ఉండేలా ప్రక్షాళన జరగాలన్నారు. ముఖ్యంగా మౌళిక వసతుల కల్పన విషయంలో గతంలో జరిగిన తప్పిదాల నుంచి అధికారులు బయటకు రావాలని, అంకితభావంతో, ప్రణాళికాబద్ధంగా పనిచేసి ముఖ్యమంత్రి ఆశయాన్ని నెరవేర్చేందుకు కృషి చేయాలన్నారు. రాష్ట్రంలోని పాఠశాలను అభివృద్ది చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం తలపెట్టిన మన బడి నాడు నేడు కార్యక్రమాన్ని నవంబర్ 14 ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు..
జగన్ ముద్ర ఉండేలా పనులు
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో సమస్యలను తీర్చడం, మౌలిక వసతుల ఏర్పాటు లక్ష్యంగా మన బడి నాడు నేడు కార్యక్రమం ప్రారంభ ఉద్దేశమని మంత్రి అన్నారు. దీనికోసం ఈ బడ్జెట్లో రూ. 1500కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఈ నిధులతో రాష్ట్రంలో 15వేల పాఠశాలల్లో సమస్యలన్నింటినీ తీర్చుతామని తెలిపారు. 9 అంశాలను ప్రాతిపదికగా చేసుకుని అభివృద్ది చేస్తామని మంత్రి తెలిపారు. తాగునీరు, టాయిలెట్లు, విద్యుత్ సరఫరా, లైట్లు, ఫ్యాన్లు, బోర్డులు ఏర్పాటు తదితర అంశాలను సత్వరం అభివృద్ది చేయనున్నట్లు తెలిపారు. అవసరమైన చోట్ల అదనపు తరగతి గదులు నిర్ముస్తామని మంత్రి తెలిపారు. పాఠశాలల అభివృద్ధికి బడ్జెట్లో అత్యధిక శాతం నిధులు కేటాయించటం జరిగిందని, రాష్ట్రంలో పాఠశాలల రూపు మార్చాలనే నిర్ణయంతో నవంబర్ 14న మనబడి నాడు-నేడు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. తొలిదశలో 15 వేల పాఠశాలల్లో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, అవినీతికి తావులేకుండా పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేయాలని ఆదేశించారు. నాడు-నేడు కార్యక్రమాన్ని పకడ్బందీగా పారదర్శకంగా చేపడతామని అన్నారు. గతం లో నిర్మించిన అదనపు తరగతి గదులు ఎలా ఉన్నాయో తెలుసునని, చెక్ మెజర్మెంట్, నాణ్యత పరిశీలన అన్నీ చేసినా మరి పాఠశాలల్లో నాణ్యత ఎలా ఉందొ చెప్పాల్సిన అవసరం లేదన్నారు. అటువంటి చర్యలకు చరమగీతం పాడాలని, నాణ్యత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని హెచ్చరించారు. పాఠశాలల అభివృద్ధి చేసి చూపుతామని, ఇప్పటికే ముఖ్యమంత్రి ఆశయానికి అనుగుణంగా పాఠశాలల ఫోటోలు తెప్పించటం జరిగిందన్నారు. మార్పు చేసిన తరువాత ఎలా ఉన్నాయో తప్పక ఫొటోలతో ప్రజల. ముందు ఉంచుతామన్నారు. పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పనలో పేరెంట్స్ కమిటీ లను భాగస్వాములను చేస్తామని మంత్రి చెప్పారు. విద్యాశాఖ పై జగనన్న ముద్ర ఉండేలా అభివృద్ధి పనులు చేయాలని సిబ్బంది అంకితభావంతో పని చేయాలని మంత్రి ఆదేశించారు.
నేటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేయండి
సోషల్ కాంట్రాక్టింగ్ విధానాన్ని తీసుకువచ్చి పూర్తిగా పారదర్శకంగా పనులు జరిగేలా చూస్తామని చెప్పారు. ఇంకా సమయం ఉందిలే మూడేళ్లలో చేద్దాం అని నిర్లక్ష్యంగా ఉండొద్దని నేటి నుంచే ప్రణాళికతో పనులకు కదలాలని అధికారులను మంత్రి సురేష్ ఆదేశించారు.
ఇదీ చదవండి:రెండేళ్లలో ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి: మంత్రి సురేష్