2019 ఓటరు జాబితాతో స్థానిక ఎన్నికల నిర్వహణను సవాలు చేస్తూ.. దాఖలైన పిటిషన్పై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. 2019 ఓటరు జాబితాతో ఎన్నికల నిర్వహణ వల్ల కొత్త వాళ్లు ఓటు హక్కు కోల్పోతున్నారంటూ అఖిల అనే విద్యార్థిని హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. 3.6 లక్షల మంది ఓటు హక్కు కోల్పోతారంటూ అందులో పేర్కొన్నారు. ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం లేకుండా ఎన్నికలు నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు.
పిటిషనర్ వాదన అర్థరహితమని విచారణ సందర్భంగా ఎస్ఈసీ తరపు న్యాయవాది వాదించారు. పిటిషనర్ ఓటు కోసం దరఖాస్తే చేయలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వ్యాజ్యాన్ని కొట్టేయాలని ధర్మాసనాన్ని కోరారు. పిటిషనర్ వాదనపై న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసి పిటిషన్ కొట్టేయబోయింది. పూర్తి వివరాలతో శుక్రవారం వాదన విసిపిస్తామని.. పిటిషనర్ తరపు న్యాయవాది కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. విచారణను రేపటికి వాయిదా వేసింది.
ఇదీ చదవండి: పంచాయతీ ఎన్నికలు.. తెదేపా మేనిఫెస్టో విడుదల