ఒకటో తరగతి నుంచి ఇంటర్ చదివే విద్యార్థులకు అమ్మఒడి పథకం వర్తిస్తుందని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. చిన్నారులకు తల్లి లేకుంటే... వారి సంరక్షకులకు అమ్మఒడి నగదు అందిస్తామని చెప్పారు. ఈ పథకానికి తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు తప్పనిసరి అని చెప్పారు. జనవరి నుంచి అర్హుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని వివరించారు.
గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు రూ.128 కోట్లు..
గర్భిణులు, బాలింతలు, 6 నెలల నుంచి ఆరేళ్లలోపు చిన్నారులకు... పౌష్టికాహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రక్తహీనత, పౌష్టికాహార లోపం అధికంగా ఉన్న 77 మండలాలను గుర్తించిన ప్రభుత్వం... ఆ ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు అదనంగా రూ.128 కోట్లు కేటాయించింది. కేంద్ర ప్రభుత్వ సాయంతో కలిపి మొత్తం... రూ.305 కోట్లు వెచ్చించాలని నిర్ణయించినట్లు పేర్ని నాని వెల్లడించారు.