Tata Group Chairman Natarajan Chandrasekaran Meet CM Chandrababu : ముఖ్యమంత్రి చంద్రబాబుతో టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ శుక్రవారం భేటీ కానున్నారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో ఉదయం 10.30 గంటలకు కీలక సమావేశం జరగనుంది. ఆ తర్వాత సీఐఐ ప్రతినిధుల బృందం సీఎంతో భేటీ కానున్నారు. సీఐఐ డీజీ చంద్రజిత్ బెనర్జీ నేతృత్వంలో ప్రతినిధులు ముఖ్యమంత్రితో సమావేశమవుతారు.
రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకు ప్రభుత్వం తీసుకురానున్న నూతన పారిశ్రామిక విధానంపై సీఐఐ ప్రతినిధులతో చంద్రబాబు చర్చించనున్నారు. పెట్టుబడుల సాధనే ప్రధాన లక్ష్యంగా దాదాపు ఆరేడు శాఖల్లో కొత్త పాలసీల రూపకల్పనపై ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. పారిశ్రామిక వేత్తల్లో నమ్మకాన్ని కలిగించి రాష్ట్రానికి పెట్టుబడులు సాధించేందుకు సీఎం విస్తృత ప్రయత్నాలు జరుపుతున్నారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, మరోవైపు ప్రైవేటు సంస్థల ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడుల సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.