Mumbai Terror Attacks : ముంబయి పేలుళ్ల ఘటనలో కీలక నిందితుడు తహవూర్ రాణాను భారత్కు అప్పగించవచ్చని అమెరికా కోర్ట్ తీర్పు ఇచ్చింది. 2008 నవంబర్ 26న ముంబయిలో జరిగిన ఉగ్రమూకల దాడిలో 116మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో పాకిస్థాన్ మూలాలు కలిగిన రాణా కీలక నిందితుడుగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో రాణాను అప్పగించాలని భారత్ చేసిన అభ్యర్థనపై గతేడాది కాలిఫోర్నియా జిల్లా కోర్టు అనుకూలంగా తీర్పు ఇవ్వగా, రాణా అదే కోర్టులో ఆతీర్పును సవాల్ చేశాడు.
ఈ తీర్పు అమెరికా-భారత్ నేరస్థుల అప్పగింత ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుందని రాణా తన పిటిషన్లో పేర్కొన్నాడు. తాజాగా రాణా పిటిషన్ను తిరస్కరిస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. భారత్-అమెరికా మధ్య ఉన్న నేరస్థుల అప్పగింత ఒప్పందానికి అనుగుణంగా గతంలో కోర్టు తీర్పు ఇచ్చినట్లు తెలిపింది. అయితే, రాణా ప్రస్తుతం లాస్ ఏంజెలెస్లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్లో శిక్ష అనుభవిస్తున్నాడు.