PM Modi Mumbai Visit : గత 3-4 ఏళ్లలో దేశంలో 8కోట్ల కొత్త ఉద్యోగాలు సృష్టించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఆర్బీఐ స్వయంగా ఈ గణాంకాలు వెల్లడించిందన్న మోదీ, ఉద్యోగ కల్పనపై తప్పుడు కథనాలను ప్రచారం చేసే వారి నోర్లు మూతబడ్డాయని అన్నారు. ముంబయిలోని గోరేగావ్లో పర్యటించిన ప్రధాని ఆ రాష్ట్రంలో రోడ్డు, రైల్వే, ఓడరేవు రంగాల్లో రూ.29,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
దేశంలో నైపుణ్యాభివృద్ధి, ఉపాధి దిశగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ముంబయితో పాటు పరిసర ప్రాంతాల్లో రానున్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఆయా ప్రాంతాల్లో కనెక్టివిటీని పెంచుతాయని వివరించారు. చిన్నపెద్దా తేడా లేకుండా పెట్టుబడిదారులంతా తమ ప్రభుత్వం మూడో దఫాను ఉత్సాహంతో స్వాగతించారన్నారు. మహారాష్ట్రను ప్రపంచంలోనే పెద్ద ఆర్థిక శక్తిగా, ముంబయిని ప్రపంచ ఫిన్టెక్ రాజధానిగా మార్చడం తమ లక్ష్యమని స్పష్టం చేశారు.