By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 8, 2024, 4:30 PM IST
ఓటర్లలో చైతన్యం - అవగాహన కార్యక్రమంలో పోస్టాఫీసులు - Voter Awareness posters
Voter Awareness By Post Office in Andhra Pradesh : రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోస్టాఫీసుల ద్వారా ఓటర్ల అవగాహన కార్యక్రమాల నిర్వహణకు సంబంధించిన పోస్టర్లను ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా విడుదల చేశారు. మొత్తం 10,670 పోస్టాఫీసుల నుంచి ఎన్నికల ప్రక్రియపై అవగాహన, ఓటర్లను చైతన్య పరిచేలా ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని తపాల శాఖ నిర్ణయించింది. ఈ మేరకు పోస్టల్ శాఖ ముద్రించిన వివిధ రకాల ఓటరు (Voter) అవగాహనా పోస్టర్లను సీఈఓ విడుదల చేశారు.
ఓటర్ల అవగాహన, ఎన్నికల భాగస్వామ్య కార్యక్రమం అమల్లో భాగంగా ఈసీఐ (ECI) పోస్టల్ శాఖతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని 57 ప్రధాన పోస్టల్ కార్యాలయాలు, 1512 సబ్ పోస్టాఫీసులు, అలాగే 9101 బ్రాంచ్ పోస్టు ఆఫీసుల ద్వారా ఓటర్లలో చైతన్యం కలిగించేలా కార్యక్రమాలు, పోస్టర్ల ప్రదర్శన నిర్వహించనున్నారు. యువత (Youth) ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా విస్తృత ప్రచారం చేస్తామని పోస్టల్ శాఖ తెలిపింది.