29 మంది దళిత ఎమ్మెల్యేలు ఉంటే - 27మందిని జగన్ మార్చారు : కూటమి నేతలు - TDP BJP JSP alliance meeting - TDP BJP JSP ALLIANCE MEETING
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 29, 2024, 7:43 PM IST
TDP BJP JSP Alliance Leaders Meeting in Tirupati : దళితులను వాడుకుని వదిలేసిన ఎకైక ముఖ్యమంత్రి జగన్ అని కూటమి అభ్యర్ధులు ఆరోపించారు. తిరుపతిలో నిర్వహించిన బీజేపీ, జనసేన,టీడీపీ నేతల ఆత్మీయ సమావేశంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈ సమావేశంలో తిరుపతి లోక్సభ అభ్యర్థి వరప్రసాద్, శాసనసభ అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ముఖ్య అతిథిలుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ మాట్లాడుతూ, రాష్ట్రంలో 29 మంది దళిత ఎమ్మెల్యేలలో 27మందిని జగన్ మార్చారని మండిపడ్డారు. నా ఎస్సీ, నా ఎస్టీలు అని నీతులు చెప్పే జగన్ దళితులకు రెండో సారి పోటీ చేసే అవకాశం ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు?. కేవలం దళితుడైనందునే నన్ను ఎంపీ నుంచి ఎమ్మెల్యేకి, ఎమ్మెల్యే నుంచి ఇంటికి పంపారని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీలో, ప్రభుత్వంలో పదవులన్నీ రెడ్లకే ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే సామాజిక న్యాయం పేరుతో బీసీలను జగన్ వాడుకుని వదిలేసారని తెలిపారు. జగన్కు దళితులు ఓట్లు కావాలి తప్ప వారికి పదవులు మాత్రం ఇవ్వరని ఆరోపించారు. చంద్రబాబు అనుభవం, మోదీ అభివృద్ధి మంత్రం కూటమి అభ్యర్ధులను గెలిపిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ, రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో 74 సీట్లు ఉంటే బలిజలకు ఒక్క సీటు కూడా జగన్ ఇవ్వలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో అభివృద్ధి ఎదైనా జరిగింది అంటే అది కేంద్రప్రభుత్వ నిధులతో మాత్రమేనని తెలిపారు. జగన్ ప్రభుత్వంలో రహదారుల్లో ఉన్న ఒక్క గుంతనైనా పూడ్చారా అని ప్రశ్నించారు?.