By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 14, 2024, 7:46 PM IST
పోలవరం ప్రాజెక్టు నష్టంపై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలి: సీపీఎం - Seminar on Polavaram Project
Seminar on Polavaram Project: పోలవరం ప్రాజెక్టుకు జరిగిన నష్టంపై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని సీపీఎం నేతలు కోరారు. ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన నష్టాలకు సంబంధించి దోషులను గుర్తించడంతో పాటు వారి నుంచి నష్ట పరిహారం కూడా వసులు చేయాలని బీవీ రాఘవులు డిమాండ్ చేశారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ప్రాజెక్టు నిర్వాసితులను పట్టించుకోవడం లేదన్నారు. ఎక్కడైనా ఒక ప్రాజెక్టు నిర్మాణం చేపడితే దానిలో మొదటి ప్రాధాన్యత మనుషులకు, రెండవ ప్రాధాన్యత నీటికి, మూడవ ప్రాధాన్యత ప్రాజెక్టుకు ఇవ్వాలన్నారు.
భూములు తీసుకున్న వివిధ ప్రాంతాల్లో అక్కడి ప్రజలకు ఎలాంటి నష్ట పరిహారం ఇస్తున్నారో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కూడా ఇళ్లు, భూములు కొల్పోయిన వారికి అలాంటి నష్ట పరిహారం ఇవ్వాలన్నారు. పోలవరం ప్రాజెక్టు గిరిజన వినాశక ప్రాజెక్టుగా ఉండాలో, మానవ ప్రయోజన ప్రాజెక్టుగా ఉండాలో ప్రభుత్వం ఆలోచన చేయాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి నిర్మాణం బాధ్యత కేంద్రంపై ఉందని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు తెలిపారు. పెరిగిన అంచనాలకు తగ్గట్టుగా కేంద్రం నిధులు ఇవ్వాలన్నారు.